లవ్ అగర్వాల్ సూచనలతో జగన్
న్యూఢిల్లీ, మే 19,
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరి మాట వినరంటారు. కానీ మాట వినడం జీవన ప్రక్రియలో ఒక భాగం. జగన్ ఎవరైనా చెప్పిన సూచనలు నచ్చితే వాటిని వెంటనే బయటకు చెప్పేస్తారు. అమలు కూడా చేస్తారు. కరోనా సందర్భంగా జగన్ కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల కంటే కొంత భిన్నంగా వ్యవహరించారు. అందరికంటే ముందుగా కీలక సూచనలు చేశారు. కొన్ని పనులను చేపట్టారు. వీటి వెనక ఎవరు ఉన్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కరోనాను కట్టడి చేయడానికి జగన్ పలు మార్గాలు సూచించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ ల ఏర్పాటుపై జగన్ తొలిసారిగా స్పందించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మాట అనాల్సి వచ్చింది. దేశ వ్యాప్తంగా మూడు జోన్లను ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా హల్ చల్ చేసింది. జగన్ బాటలోనే దేశం పయనిస్తుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చింది. నిజానికి జగన్ ఆలోచనేనా? లేక ఎవరైనా సూచించారా? అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది.కరోనాతో సహజీవనం చేయాల్సిందే తప్పదు అని జగన్ వ్యాఖ్యానించడంతో వివాదం తలెత్తింది. విపక్షాలు జగన్ వ్యాఖ్యలపై మండి పడ్డాయి. జగన్ ఆలోచనలు అలాగే ఉంటాయని, లాక్ డౌన్ ఎత్తివేసి ఎన్నిలకను నిర్వహించడానికే జగన్ ఇలా అన్నారని కామెంట్స్ పడ్డాయి. అయితే ఆ తర్వాత వరసగా అందరు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి సయితం సహజీవనం చేయాల్సిందేనని అనడంతో విపక్షాలకు నోట మాట రాలేదు.అయితే కరోనాకు సంబంధించి జగన్ కు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నది కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గా తెలుస్తోంది. ఆయన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి, 2021లో తిరిగి ఏపీకి తిరిగి రానున్నారు. అందుకే ఆయన జగన్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. కోవిడ్ విషయాల్లో తనకు తలెత్తుతున్న అనుమానాలు జగన్ లవ్ అగర్వాల్ నుంచే తెలుసుకుంటున్నారు.ఏపీ సీఎంవో అధికారులు సయితం లవ్ అగర్వాల్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ కోవిడ్ కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇస్తుంది లవ్ అగర్వాల్ అని పార్టీలో కూడా చర్చించుకోవడం విశేషం