YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కన్నాకు కరెంట్ షాక్

కన్నాకు కరెంట్ షాక్

కన్నాకు కరెంట్ షాక్
గుంటూరు, మే 19,
రాష్ట్రంలో విద్యుత్ స్లాబులు మార్చడం ద్వారా పరోక్షంగా భారీగా కరెంటు బిల్లులు పెంచారని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. తనకు రెండు నెలల్లోనే ఏకంగా రూ. 31 వేల కరెంటు బిల్లు వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. విద్యుత్ చార్జీల విషయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలివిగా వ్యవహరిస్తూ, ప్రజల నుంచి భారీగా బిల్లులు వసూలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లలోనే నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వినియోగదారుల ఏడాది విద్యుత్‌ వినియోగం ఆధారంగా గతంలో ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించారన్నారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లలో ఉంటున్నారని, దీని వల్ల కరెంటు వాడకం పెరుగుతుందని చెప్పారు.దీంతో మధ్య తరగతి ప్రజలు కూడా 225 యూనిట్లకు పైగా వినియోగించాల్సి వచ్చిందని కన్నా పేర్కొన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం విద్యుత్‌ బిల్లులు పెంచలేదని చాలా తెలివిగా చెబుతోందని, కానీ శ్లాబ్‌ కారణంగా పేద, మధ్య తరగతి వినియోగదారులు కూడా గ్రూపు-సి లోకి మారిపోయారని వివరించారు. దీంతో గతంలో కంటే రెండు, మూడు రెట్లు బిల్లులు పెరిగినట్లు తెలిపారు. తాను కూడా మార్చి నెలలో రూ.11,541 చెల్లించానని, ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటిందని వెల్లడించారు. మొత్తంగా రెండు నెలల్లోనే రూ. 31 వేలకు పైగా కరెంటు బిల్లు చెల్లించినట్లు వెల్లడించారు. కరెంటు బిల్లులు ఇంత భారీగా వస్తుంటే ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచలేదని ఎలా చెబుతుందని కన్నా మండిపడ్డారు.

Related Posts