కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ మే19
కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ వాడిన భాష సరిగా లేదని ఆక్షేపించారు. దేశ హితం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమని అయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఒక్క రూపాయి దుర్వినియోగమైందా అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. మోదీ వెనుక యావత్ దేశం ఉందంటూ న్యూయార్క్ టైమ్స్ సహా 50 అంతర్జాతీయ పత్రికలు ప్రశంసించాయని చెప్పారు. ఎవరో అడ్రస్ లేని వాళ్లు చెప్పారంటూ ప్రధానిని కేసీఆర్ విమర్శించడం తగదని అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవద్దని కేసీఆర్ కు కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణ ప్రజలకు లబ్ధి ఉంటుందా? లేదా? అనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతు బంధు పథకం వర్తించదని కేసీఆర్ అంటున్నారు. మీరు చేసింది సరైనప్పుడు కేంద్రం చేసింది ఎందుకు సరికాదు. రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారు. తెలంగాణ నుంచి పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారు. వలస కార్మికుల సమస్య 30-40 ఏళ్ల నుంచి ఉందని అయన అన్నారు. దేశంలో ఉపాధి పనుల పని దినాలు పెంచామని గుర్తు చేశారు. ఉపాధి నిధులతో తెలంగాణలో అభివృద్ధి జరగలేదా? అని దుయ్యబట్టారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు.