జూన్ నెలలో మంత్రివర్గ విస్తరణ
విజయవాడ, మే 20,
జూన్ నెలాఖరుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రాజ్యసభ ఎన్నికలను నిర్వహించే యోచనలో ఉంది. కరోనా కారణంగా రాజ్యసభ ఎన్నికలను దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. అయితే జూన్ నెలాఖరుకు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం కానుండటంతో రాజ్యసభ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తుంది. జూన్ మొదటి వారంలోనే రాజ్యసభ ఎన్నికలు ఉండే అవకాశముందని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు స్థానాలకు ఐదుగురు పోటీలో ఉన్నారు. నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనుంది. అయితే మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. శాసనమండలిని రద్దు చేయడంతో జగన్ వీరిద్దరినీ రాజ్యసభకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభకు నామినేషన్ వేసిన తర్వాత ఇద్దరు మంత్రులు మానసికంగా సిద్ధమయ్యారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఇప్పటికే జగన్ ఆదేశించారు. దీంతో వీరిద్దరూ పెద్దగా యాక్టివ్ గా లేరు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్ పెద్దగా కన్పించడం లేదు. శాఖాపరమైన సమీక్షలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నాు. మరికొద్దిరోజుల్లో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో శాఖాపరంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. మోపిిదేవి కొంత యాక్టివ్ గానే కన్పిస్తున్నారు.జూన్ నెలలోనే జగన్ మంత్రి వర్గ విస్తరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం ఇద్దరికి మాత్రమే మంత్రి వర్గ విస్తరణలో అవకాశముందని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ నెల 30వ తేదీకి ఏడాది పూర్తి కావస్తుంది. దీంతో మంత్రుల పనితీరుపై కూడా సీఎం జగన్ సమీక్షిస్తున్నారని చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ మాత్రం ఖాయం. అయితే ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.