రివర్స్ గేర్ లో కన్నా
గుంటూరు, మే 20
న్నికలకు ముందు కనీసం నాయకుల మధ్య ఫోన్ సంభాషణలైనా జరిగేవి. కేంద్రం నుంచి కీలక నాయకులు ఎవరైనా వస్తున్నారంటే.. మూకుమ్మడిగా వెళ్లి కలిసి కుశలాలు అడిగేవారు. కానీ, ఎన్నికల తర్వాత నుంచి పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య అంతగా సఖ్యత లేదనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. నేతలు ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారిగా కూడా విడిపోయారు. కేంద్రం నుంచి కీలక నేతలు ఏపీకి వచ్చినా.. గ్రూపుల వారీగా వెళ్లి కలుస్తున్నా రే తప్ప.. మూకుమ్మడిగా వెళ్తున్న సందర్భాలు ఎక్కడా కనిపించడం లేదు.మరి ఇలాంటి పరిస్థితి బీజేపీలో ఎందుకు వచ్చింది? ఎవరికి వారుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే అంటున్నారు విశ్లేషకులు. అదే.. ఏపీ బీజేపీ సారధి కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం! ఒకింత బాధగానే అనిపించినా.. ఇది నిజమని చెబుతున్నారు. నిజానికి అనూహ్య రీతిలో బీజేపీ పగ్గాలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకులే ఎక్కువగా ఉన్నారు. ఆయనకు పగ్గాలు ఇవ్వడాన్ని.. చాలా మంది నేతలు బీజేపీలో వ్యతిరేకించారు. అయినా కూడా కేంద్రం ఆదేశాలతో సర్దుకుపోదాంలే అనుకున్నారు. అప్పట్లో ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే క్రమంలోనే కన్నాకు బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణ కు ఏపీ పగ్గాలు కట్టబెట్టింది.అయితే, రాష్ట్రంలో బీజేపీ నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంలోను భిన్నాభిప్రాయాలను సమపాళ్లలో స్వీకరించి ఒకే అంశంగా మార్చడంలోనూ కన్నా లక్ష్మీనారాయణ విఫలమయ్యారని అంటున్నారు. దీనికి తోడు కేంద్రంలోని కీలక నాయకులతోనూ కన్నా విభేదిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి చెందిన కీలక నేత.. కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. ఆయనకు కన్నా లక్ష్మీనారాయణకు పొసగడం లేదు. పైకిబాగానే ఉన్నా.. రాజకీయంగా ఇద్దరి మధ్య ఆధిపత్య ధోరణి పెరిగింది. ఇది రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కన్నా లక్ష్మీనారాయణ మాటలకు సొంత పార్టీలోనే నేతల నుంచి కౌంటర్లు వస్తున్నాయి.ఇక ఏపీ బీజేపీలో కీలక నేతలు కూడా చంద్రబాబు, జగన్ వర్గాలుగా చీలిపోయారని.. బాబు వర్గం జగన్ను టార్గెట్ చేసేలా విమర్శలు చేస్తోందని.. ఇందులో కన్నా లక్ష్మీనారాయణ కీలకమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహారావు వర్గం జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న టాక్ ఉంది. మరోపక్క, కకన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడు తప్పుకొంటారా? అని ఎదురు చూస్తున్న నాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవన్నీ ఇలా.. ఉంటే.. సమర్ధమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ బీజేపీ విఫలమైందని ఈ పార్టికి చెందిన నాయకులే విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీ ఎలా ఉన్నా.. నేతల మధ్య మాత్రం సఖ్యత క్కడా కనిపించడం లేదనేది వాస్తవం.