YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రతిపక్షాలకు చెక్ పెట్టిన ఇద్దరు సీఎంలు

ప్రతిపక్షాలకు చెక్ పెట్టిన ఇద్దరు సీఎంలు

ప్రతిపక్షాలకు చెక్ పెట్టిన ఇద్దరు సీఎంలు
హైద్రాబాద్, మే 20,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల బంధం ఫెవికాల్ కన్నా గట్టిదేనా …? రెండు రాష్ట్రాల నడుమ జల జగడం మొదలు అయినా దీన్ని లైట్ తీసుకోవాలనే రీతిలో తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలు తేల్చడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మా ఇద్దరి నడుమ సఖ్యత బాగుంది, ఇకపై కూడా బాగుంటుంది అంటూ గులాబీ బాస్ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నే అయ్యింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఏపీ నీటిని అక్రమంగా తరలిస్తుందంటూ మొదలైన యుద్ధానికి ప్రస్తుతానికి కేసీఆర్ లౌక్యంగా తెరదించారు. ఈ సమస్యను కాంగ్రెస్, బిజెపి లు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలకు పూర్తిగా చెక్ పెట్టేందుకే ఆయన వ్యూహం ఉన్నట్లు కేసీఆర్ తీరు చెప్పక చెప్పింది.ఏపీ తెలంగాణ సిఎం ల నడుమ యుద్ధం అంతా డ్రామాగానే టిడిపి మొదటి నుంచి అనుమానించింది. ఇది కావాలనే రెండు రాష్ట్రాలు లేవనెత్తయన్నది పసుపు దళపతి అనుమానం. దాంతో ఈ వ్యవహారంపై నోరు పెద్దగా మెదపకుండా జాగ్రత్త పడింది టిడిపి. అయితే వైసిపి మాత్రం పదేపదే టిడిపి వైఖరి చెప్పాలంటూ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నం చేసింది. వివాదాస్పద అంశంలో తమ వైఖరి చెబితే తెలంగాణాలో మిణుకు మిణుకుమంటూ ఉన్న తమ పార్టీ దీపం మొత్తం ఆరిపోతుందన్న టిడిపి ఆందోళన ఉన్న నేపథ్యంలో ఆచితూచి దీనిపై అడుగులు వేసింది.అయితే ఏపీ బిజెపి శాఖ ఇక్కడ, తెలంగాణ వాదనకు అనుకూలంగా టి బిజెపి లైన్ తీసుకున్నాయి. కాంగ్రెస్ అదే దారిలో పోయింది. అయితే ఈ కీలక అంశంలో తెగేదాకా లాగి రెండు తెలుగు రాష్ట్రాల నడుమ చిగురించిన స్నేహ వాతావరణం చెదిరి పోకుండా కేసీఆర్ జాగ్రత్త పడటంతో ఇప్పుడు వేడి చల్లారింది. కానీ రాబోయే రోజుల్లో మరోసారి ఈ అంశం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జల జగడాన్ని అవసరమైన సమయంలో తెరమీదకు తేనున్నాయి. అప్పుడైనా టిడిపి ఏదో ఒక స్టాండ్ తీసుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దానికి చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి సీమకు నీళ్లు వెళితే తప్పేంటీ సముద్రం పాలయ్యే నీళ్లు సీమకు తరలించడంలో తప్పేం లేదని, రాయలసీమకు నీళ్లు ఎందుకు పోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తెలిసీ తెలియక మాట్లాడేవారి గురించి తాను పట్టించుకోనన్నారు. నీటి వాటాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరికి మంచి జరగాలన్నదే మా ఆశ.  ప్రజల అవసరాల కోసం నీళ్లు తీసుకోవటంలో తప్పులేదు. బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ పడినా ఒక్క టీఎంసీ కూడా సాధించలేదు. ఘర్షణ వాతావరణం ఏ రాష్ట్రానికి అవసరం లేదు. మాకు రెండు నాల్కలు లేవు. గోదావరిలో మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేద’’ని స్పష్టం చేశారు.
‘‘రాయలసీమకు గోదావరి జలాలను మళ్లించుకోవచ్చు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా గోదావరిలో నీళ్లు ఉన్నయ్‌. ఎవరు తీసుకెళ్లినా మాకు అభ్యంతరం లేదు’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కానీ కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఒక్క క్షణం కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ‘‘బేసిన్లు లేవు... భేషజాలు లేవు.. బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి... మేం వాడుకుంటాం.. మీరూ వాడుకోండి. ఇరురాష్ట్రాలకు సరిపోను ఇంకో 1,000 టీఎంసీలున్నాయి’’ అని ఏపీ ప్రభుత్వానికి చెప్పానని కేసీఆర్‌ తెలిపారు. పిచ్చి కొట్లాట అనవసరమని తెలిపామన్నారు. పైగా ఏపీ సీఎం జగన్‌తో తమకు ఎలాంటి వివాదాలు లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పోతిరెడ్డిపాడుపై రెండు రాష్ట్రాల్లో జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందించారు. జగన్‌తో దోస్తీ ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకూ అన్యోన్యంగా కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. అదేసమయంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. జలాల పంపిణీపై మంచి మాట చెబుతామన్నారు. వింటే వింటారని.. లేకుంటే లేదని.. తమకొచ్చిన నష్టమేమీ లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంలో చొరవ తీసుకోమని కేంద్రాన్ని కోరతారా.. అని ఓ విలేకరి అడగబోగా.. ‘నీకేదో కిరికిరి, పంచాయతీ పెట్టాలని కోరిక ఉన్నట్లుంది.. అదేం జరగదు. మీదారిన మీరు ఉండమని ఏపీకి చెబుతున్నం. ఉంటే మంచిమాట. లేదు.. కొట్లాటంటే కొట్లాట’ అని కేసీఆర్‌ ఫైనల్‌గా బదులిచ్చారు.

Related Posts