ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటి మంది ప్రయోజనం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ మే 20
ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటి మంది ప్రయోజనం పొందారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రారంభించిన రెండేళ్లలోపే ఈ ఘనత సాధించగలిగామంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రయోజనం పొందిన కుటుంబాలను అభినందించారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్ధిస్తానని మోదీ ట్విటర్లో తెలిపారు. పథకాన్ని విజయవంతం చేసిన డాక్టర్లకు, నర్సులకు, మెడికల్ సిబ్బందికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. 2018 సెప్టంబర్లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రారంభించింది. అనేక రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో ఉంది. కరోనాతో సహా చాలా రకాల జబ్బులకు ఉచితంగా చికిత్స పొందగలిగే అవకాశం ఆయుష్మాన్ భారత్ కల్పిస్తోంది. పేదలకు వరంగా మారిన ఈ పథకాన్ని రాజకీయాల కారణంగా కొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ అమల్లో లేదు. మరోవైపు 19 నెలల్లోనే ఈ పథకం ద్వారా కోటి మంది ప్రయోజనం పొందడంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత ఆరోగ్య పరిరక్షణ పథకం కానుందన్నారు.