YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

25 నుంచి విమాన సర్వీసులు

25 నుంచి విమాన సర్వీసులు

25 నుంచి విమాన సర్వీసులు
న్యూఢిల్లీ, మే 21,
విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త అందించింది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన విమాన సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సోమవారం (మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ  ట్వీట్ చేశారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, విమాన సంస్థలకు ఈ సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన విమానాలను తిరిగి ప్రారంభించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశం ముగిసిన కొద్ది గంటలకే విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. దేశీయ విమాన సేవలు దశల వారీగా ప్రారంభం అవుతాయని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా విమాన సేవలు నిలిచిపోవడంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులన్నీ బోసిపోయాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో విమానాశ్రయాల్లో మళ్లీ సందడి నెలకొననుంది. అయితే.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్టులతో పాటు విమానాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. అత్యవసర సేవలకు విమానాలను అనుమతించింది. విమాన అంబులెన్స్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి ‘వందే భారత్ మిషన్’ చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే వేలాది మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. ఈ క్రమంలో దేశీయ విమాన సేవలను ప్రారంభించాలని పెద్ద ఎత్తున డిమాండ్ రాగా.. కేంద్రం సానుకూలంగా స్పందించింది. అంతర్జాతీయ విమాన సేవలకు మాత్రం మరి కొంత కాలం ఆగాల్సిందే!

Related Posts