ఒకే ఆస్పత్రిలో 115 మంది శిశువులకు జన్మనిచ్చిన కరోనా గర్భిణులు
ముంబయి మే 21
కరోనా వైరస్ ధాటికి ముంబయి నగరం అతలాకుతలమైంది. దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటైన ముంబయిలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. ఒక్క ముంబయిలోనే 24 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 840 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వందలాది మంది గర్భిణులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిని కూడా ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించారు. అలాంటి గర్భిణుల్లో చాలా మంది సుఖ ప్రసవం చేశారు. కొందరికి సీజేరియన్ కూడా జరిగింది. పుట్టబోయే పిల్లలకు కరోనా లేదని తేలడంతో వారి తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు.ఇండియాలోని ముంబయిలో మాత్రం 100కు పైగా గర్భిణులకు కరోనా సోకింది. వీరంతా లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. కరోనా సోకిన గర్భిణులు.. గత నెల రోజుల నుంచి 115 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ.. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. కరోనా సోకిన ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. కరోనా గర్భిణులకు పుట్టిన పిల్లల్లో 56 మంది మగ పిల్లలు, 59 మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ గర్భిణులకు 65 మంది డాక్టర్లు, సుమారు 24 మంది నర్సులు దగ్గరుండి వైద్య సేవలు అందించారు. లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రిలోని 40 బెడ్ల వార్డులో వీరికి చికిత్స అందించారు. ప్రెగ్నెంట్ మహిళల కోసం అదనంగా 34 బెడ్లను అందుబాటులో ఉంచారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని గర్భిణులకు డెలివరీలు చేశారు వైద్యులు. అయితే గర్భిణుల్లో అధిక మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు. కొందరూ జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు. డెలివరీ జరిగిన తర్వాతే వారిని వారి నివాసాలకు పంపించామని చెప్పారు. గర్భిణులకు డెలివరీ జరిగిన తర్వాత వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచామన్నారు వైద్యులు. వారం రోజుల తర్వాత మళ్లీ క్వారంటైన్కు తరలించినట్లు చెప్పారు. అయితే పిల్లలకు పాలిచ్చే సమయంలో తల్లులు ఫేస్మాస్కు ధరించారు.