దేశీయ విమాన ప్రయాణికులకు ఆరోగ్యసేతు తప్పనిసరి..
హైదరాబాద్ మే 21
దేశీయ విమాన సర్వీసులను ఈ నెల 25 నుంచి దశలవారీగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఇవాళ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దేశీయ విమాన ప్రయాణికులకు కచ్చితంగా ఆరోగ్యసేత యాప్ ఉండాలని సూచించింది. ఇక 14 ఏళ్ల వయసు లోపు ఉన్నవారికి మాత్రం ఆరోగ్యసేతు యాప్ అవసరం లేదని ఎయిర్పోర్ట్ అథారిటీ పేర్కొన్నది. టర్మినల్లో ఎంటర్ అయ్యే ప్రతి ప్రయాణికుడు తప్పకుండా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి వస్తుంది.ఎయిర్పోర్టుల వద్ద ఫిజికల్ చెకింగ్ ఉండదు. ఆన్లైన్ లేదా టెలిఫోన్ ద్వారా చెక్ ఇన్ ఉంటుంది. ఎయిర్లైన్స్ సేఫ్టీ కిట్ను ఇస్తాయి. దాంట్లో మాస్క్, శానిటైజర్, ఫేస్ షీల్డ్ ఉంటుంది. ఒక హ్యాండ్ బ్యాగ్, 20 కిలోల లగేజీ బ్యాగ్కు అనుమతి ఇస్తారు. ప్రయాణికులకు భోజనం సౌకర్యం ఉండదు. విమానంలో ఎటువంటి ఆహారాన్ని తినరాదు. క్యాబిన్ సిబ్బంది పీపీఈ గౌన్ ధరిస్తారు. కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ‘దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి దశలవారీగా పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు సిద్ధమవ్వాలని అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు సమాచారమిచ్చాం’ అని హర్దీప్సింగ్ పురి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రయాణికులకు సంబంధించిన విధివిధానాలను విమానయాన శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుందని చెప్పారు. కరోనా నియంత్రణకు భారత్తోపాటు అనేక దేశాలు దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేయడంతో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో నష్టాల నుంచి గట్ట్టెక్కేందుకు పలు విమానయాన సంస్థలు ఉద్యోగులను తొలిగించడం, వేతనాల్లో కోతవేయడం వంటి చర్యలకు దిగాయి.