పేటలో గోపీరెడ్డికి ఢోకా లేనట్టే
గుంటూరు, మే 22
యన స్వతహాగా పెద్ద డాక్టర్. రాజకీయాలకు దూరం. అయినా కూడా.. వైసీపీ అధినేతతో ఏర్పడిన చిన్న పరిచయం.. ఆయనను రాజకీయాల వైపు నడిపించింది. అన్య మనస్కంగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇది 2014కు ముందు మాట. అయితే, అప్పటి పరిస్థితిలో ఆయన పట్టుదలగా తీసుకున్నారు. అనంతరం జగన్ అమ్ముల పొదిలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఒకవైపు ప్రజలను మచ్చిక చేసుకుంటూ.. మరోవైపు పార్టీలోనూ తనకంటూ గుర్తింపు సాధించారు. వివాద రహితుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన కారణంగానే కీలకమైన ఆ నియోజకవర్గంలో పార్టీకి ఢోకా లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. ఆయనే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన ప్రముఖ డాక్టర్. స్థానికంగా పెద్ద ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నారు.అయితే, 2014 ఎన్నికలకు ముందు జగన్ పిలుపుతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జెండా పట్టుకున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆయన పోటీకి నిలబడ్డారు. వాస్తవానికి నరసరావుపేట రాజకీయాలు చాలా డిఫరెంట్. ఇక్కడ నుంచి మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఆయన బలమైన అభ్యర్థి. అదే సమయంలో టీడీపీ తరఫున సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి, దివంగత కోడెల శివప్రసాద్రావు ఉన్నారు. ఇలాంటి ఉద్దండులను ఢీకొన్నాల్సి ఉన్నప్పటికీ.. జగన్ పిలుపుతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీకి నిలబడ్డారు. జగనే బలం, జగనే ధైర్యం.. అంటూ ఆయన అప్పట్లో ప్రచారం చేశారు. నిజానికి అటు కాసు, ఇటు కోడెల ముందు సీనియార్టీ సహా వ్యూహాల్లోనూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జూనియర్. అయితే, ఆయన ప్రజలకు చేసిన వైద్య సేవలు ఆయనను ఉత్థాన స్థితిలో నిలబెట్టాయి. అదే ఆయన గెలుపునకు కారణమైంది.2014 ఎన్నికల్లోబీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ఈ నియోజకవర్గం బీజేపీకి దఖలు పడింది. దీంతో కోడెల సత్తెన పల్లి నుంచి పోటీ చేయడం, కాసు వెంకటకృష్ణారెడ్డి ఏకంగా రాష్ట్ర విభజన పేరుతో పూర్తిగా ఎన్నికల నుంచి తప్పుకోవడంతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి రాజకీయాలు కలిసి వచ్చాయి. దీనికితోడు.. జగన్ హవా కూడా పనిచేసింది. దీంతో ఆయన అప్పటి ఎన్నికల్లో ఓడిపోతారని బెట్టింగులు కట్టుకున్నవారికి పరాభవం ఎదురై, ఆయన దిగ్విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆ సీటు బీజేపీకి ఇవ్వడం.. కోడెల, కాసు లాంటి ఉద్దండులు పేట ఎన్నికల బరిలో లేకపోవడంతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏకంగా 16 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగని గోపిరెడ్డి తన పనితాను చేసుకుని పోలేదు. రాజకీయంగా కుదురు కునేందుకు ఏం చేయాలో అంతా చేశారు. ప్రజల సమస్యలపైనా ఆయన పోరాడారు. అదేసమయంలో కోడెల కుమారుడు డాక్టర్ శివరామకృష్ణ దూకుడును ఎదుర్కొనేందుకు కూడా ప్రయత్నించారు. ఇలా ఆ ఐదేళ్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా.. ఎదురీదాల్సి వచ్చింది.మరోవైపు పార్టీ మారాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిళ్లు కూడా వచ్చాయి. ఇక నియోజకవర్గంలో బలమైన అనుచరగణం ఉన్న కాసు ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఇందుకు ప్రధాన కారణం గురజాల ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి దృష్టంతా నరసారావుపేట మీద ఉండడమే. ఇక, జగన్ సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించినప్పుడు.. దీనికి మద్దతుగా గోపిరెడ్డి తన నియోజకవర్గం నుంచి తిరుపతికి పాదయా త్ర చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. అదే సమయంలో ప్రజలకు కూడా చేరవయ్యారు. పేదలకు తన ఆసుపత్రిలో రూ.50కే వైద్యం అందించి అన్ని వర్గాలకు చేరువయ్యారు. కీలకమైన ఆపరేషన్లకు కేవలం 50 శాతం బిల్లు చేసి.. జగన్ దృష్టిలో పడ్డారు.ఇలా వ్యవహరించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గత ఏడాది ఎన్నికల్లో మరింత భారీ విజయం నమోదు చేశారు. వివాద రహితుడు, నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయడంతో గోపిరెడ్డికి జగన్ కేబినెట్లో మంత్రి పదవి గ్యారెంటీఅనుకున్నారు. లేదా విప్ వస్తుందనుకున్నారు. కానీ, సామాజిక సమీకరణలు కుదరని నేపథ్యంలో ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. అయినా కూడా ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ చేయకుండా.. గుంటూరు రాజకీయాల్లో డాక్టర్ లీడర్మంచి గుర్తింపు సాధించడం, కొత్తగా ఎన్నికైన వారు ఒకవైపు జుట్టు జుట్టు పట్టుకుని వివాదాలు చేసుకుంటున్నా.. తనపనితాను చేసుకునిపోవడంతో ఇక్కడ ఇక, వైసీపీకి ఢోకా లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులతోనూ ఎంతో సఖ్యతతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కోడెల లేకపోవడం… టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు సైతం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇప్పట్లో గోపిరెడ్డికి పేటలో ఢోకా లేదు.