జర్నలిస్టుల రాయితీలు కొనసాగుతాయి
ఆర్టీసీ ఎండి మాదిరెడ్డి ప్రతాప్
విజయవాడ మే 22
ఆర్టీసీలో పాత్రికేయులకు ఎప్పటి వలే రాయితీలు కొనసాగుతాయని సంస్థ ఎండి మాదిరెడ్డి ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే జర్నలిస్టులకు లాక్డౌన్ ముందు ఎలాంటి రాయితీలు ఉన్నాయో అవి యధాతధంగా కొనసాగిస్తామని ఆర్టీసీ పిఆర్ఒ పేరిట విడుదలైన ఒక ప్రకటన పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఆర్టీసీ సర్వీసులు మొదలైనప్పుడు బస్సుల్లో వివిధ వర్గాలకు కేటాయిస్తున్న రాయితీలను తాత్కాలికంగా ఆపివేస్తున్నామని సంస్థ అధికారులు ప్రకటించారు. వృద్ధులు, వికలాంగులు, పాత్రికేయులు తదితరులకు అప్పటి వరకు ఉన్న రాయితీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. అయితే దీనిపై జర్నలిస్టు సంఘాలు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి ‘జర్నలిస్టు’లకు రాయితీ కొనసాగించాలని సూచించారు. ఆయన సూచన మేరకు ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా..మిగతా వర్గాలకు ఇచ్చే రాయితీ కొనసాగుతుందా...? లేదా...? అనే దానిపై స్పష్టత లేదు. ఆర్టీసీ పిఆర్ఒ విడుదల చేసిన ప్రకటనలో జర్నలిస్టు రాయితీలు మాత్రమే యధాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.