YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ దేశీయం

సౌత్ సెంట్రల్ రైల్వే న్యూ రికార్డు

సౌత్ సెంట్రల్ రైల్వే న్యూ రికార్డు

సౌత్ సెంట్రల్ రైల్వే న్యూ రికార్డు
సికింద్రాబాద్, మే 25,
దేశ వ్యాప్తంగా వలస కార్మికులను తరలించేందుకు ఉద్దేశించిన శ్రామిక్‌ రైళ్లలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికిపైగా కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చినట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. మే 1 నుంచి 23 వరకు 23 రోజుల కాల వ్యవధిలో 2,41,768 మందిని సొంత ప్రాంతాలకు పంపినట్లు ప్రకటనలో వివరించారు. ఈ జోన్ పరిధిలోనే 16 రోజుల్లో మొదటి లక్ష మందిని చేరవేర్చినట్లు విశ్లేషించింది. తర్వాత లక్ష మంది ప్రయాణికులను తర్వాతి 7 రోజుల్లోనే తరలించినట్లు వివరించింది.ఇక దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో తెలంగాణ నుంచి 1.50 లక్షలు, ఏపీ నుంచి 65 వేల మందికి పైగా ప్రయాణికులను శ్రామిక్‌ రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు చేర్చినట్లుగా వెల్లడించింది. ఎస్‌సీఆర్ పరిధిలో 196 శ్రామిక్‌ రైళ్లను నడిపారు. శనివారం ఒక్కరోజు కేవలం 12 గంటల వ్యవధిలో 43 రైళ్లను నడిపినట్లుగా వివరించారు.
సాధారణ ప్రయాణికులకు నిబంధనలివే.. మరోవైపు, లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా దేశీయంగా ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్న సంగతి తెలిసిందే. విమానాలు, రైలు, బస్సుల్లో ప్రయాణించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వివరాలను ట్రావెలర్స్‌, ఏజెన్సీలు టికెట్‌తో పాటు ముద్రించాల్సి ఉంటుందని నిర్దేశించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో ప్రకటించిన విధి, విధానాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్‌‌ను తప్పకుండా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రయాణికులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి.. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి. ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్‌లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఆయా ప్రయాణ ప్రాంగణాలను తరచూ శానిటైజ్‌ చేయాలి. క్రిమినాశక ద్రావణాలతో శుభ్రపరచాలి. అదే విధంగా ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.ప్రయాణం ముగించుకుని బయటకు వెళ్లే సమయంలోనూ ప్రయాణికులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను దగ్గర్లో ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తరలించాలి. తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి.

Related Posts