ఆగని వలస కూలీల పాదయాత్రలు
న్యూఢిల్లీ మే 25,
ఇన్ని రోజుల తర్వాత కూడా సొంత ఊళ్ళు వెళ్లేందుకు వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పగటిపూట ఎండను భరించలేక, ఇతర కారణాల వల్ల వలస కార్మికులు రాత్రి సమయంలో నదులను దాటుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. హరియాణా నుంచి బిహార్లోని తమ సొంత గ్రామాలకు కాలినడకన వెళ్లేందుకు... సుమారు రెండువేల మందికి పైగా యమునా నదిని దాటేశారు. వీరు మొదట ఉత్తర్ ప్రదేశ్లోని షహరన్పూర్కు, అక్కడినుంచి బిహార్ వెళ్లేందుకు కాలిమార్గంలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో యమునా నదిని దాటి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతున్నప్పటికీ అందులో ప్రయాణించే అవకాశం లభించని వందలాది మంది కాలినడకనే బయలుదేరుతున్నారు. ఎండాకాలం కారణంగా నదిలో నీరు తక్కువగా ఉండటంతో తాము నదిని దాటి వెళ్తున్నామని వలస కార్మికులు చెబుతున్నారు. మా దగ్గర డబ్బు ల్లేవ్.. రోడ్డుపై వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని కొడుతున్నారు. అందుకే రాత్రి పూట నదిని దాటుతున్నామని వీళ్ళుప్ చెబుతుండటం కంట నీరు తెప్పిస్తోంది. బిహార్ వరకు మేము నడిచే వెళ్తామని యమునానగర్లోని ఓ ప్లైవుడ్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుడు చెబుతుండటం ప్రస్తుత పరిస్థితిని కళ్ళకు కడుతోంది. లాక్డౌన్ కారణంగా తమను యజమానులు పనుల నుంచి తొలగించారని... ఉన్న డబ్బు కాస్త అయిపోవటంతో తాము యమునానగర్లోని ఆశ్రయ కేంద్రంలో ఉన్నామని నదిని దాటిన వాళ్ళు చెబుతున్నారు.. తమకు ఆహారం లభించటం లేదని వీరిలో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. తమలో ఎక్కువ మంది అర్ధాకలితోనే నడక సాగిస్తున్నారని వారు వాపోయారు. సమీప గ్రామాల ప్రజలు కొందరు దయతలచి ఆహారం, నీరు ఇస్తున్నారని తెలిపారు. మరోవైపు వలస కార్మికులందరినీ వారి గ్రామాలకు చేర్చేందుకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు ఊదరగొట్టేస్తున్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాలకులు హామీ ఇస్తున్నా వలస కార్మికుల ప్రయాణాలు ఆగడం లేదనేది వాస్తవం,