ఎగిరిన విమానాలు...
న్యూఢిల్లీ, మే 25
సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. ప్రయాణికుల విషయంలో రాష్ట్రాలు వేర్వురుగా నిబంధనలు ప్రకటించాయి. దీంతో కొంత గందరగోళం నెలకుంది. ముఖ్యంగా పైలట్లను అయోమయంలోకి నెట్టేసింది. ప్రయాణికులకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్ సహా పలు రాష్ట్రాలు సొంతంగా క్వారంటైన్ నిబంధనలను రూపొందించాయి. ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని, హోం క్వారంటైన్లో ఉండాలని పలు రాష్ట్రాలు సూచించాయి.విమానాల్లో వచ్చే ప్రయాణికులు రెండు వారాలపాటు ఇంటికే పరిమితమవ్వాలని కేరళ, పంజాబ్ నిర్దేశించాయి. తమ రాష్ట్రానికి వచ్చేవారిని చెల్లింపు క్వారంటైన్లో రెండు వారాలపాటు ఉంచుతామని బిహార్ స్పష్టం చేసింది. ప్రయాణికులకు 14 రోజులు అడ్మినిస్ట్రేటివ్ క్వారంటైన్ తప్పనిసరి అని జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పేర్కొన్నాయి. తమ రాష్ట్రానికి వచ్చేవారు వారం రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్, మరో వారం హోం క్వారంటైన్లో ఉండాలని అసోం స్పష్టం చేసింది.కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజులపాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని, తర్వాత మరో ఏడు రోజులు ఇంటికే పరిమితమవ్వాల్సి ఉంటుందని కర్ణాటక తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించింది.
మహారాష్ట్ర: స్క్రీనింగ్ పరీక్షల అనంతరం 14 రోజుల హోం క్వారంటైన్
రాజస్థాన్: సీనియర్ సిటిజన్స్, లక్షణాలు ఉన్నవారికి 14 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్
ఉత్తరప్రదేశ్: 14 రోజుల హోం క్వారంటైన్.. వ్యాపార పనులపై వెళ్లవారికి దీని నుంచి మినహాయింపు.
ఉత్తరాఖండ్: ప్రభుత్వ క్వారంటైన్లో 10 రోజులు ఉండాలి.
పశ్చిమ్ బెంగాల్: ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మే 28 నుంచి ఆ రాష్ట్రంలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి.
ఒడిశా: ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంది. మిగతావారు 14 రోజులు ఐసోలేషన్లో ఉండాలి.
మిజోరాం: ప్రభుత్వ హోం శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నవారికే అనుమతిస్తారు.
చత్తీస్గఢ్: ప్రభుత్వం క్వారంటైన్లో 14 రోజులు ఉండాలి.
తమిళనాడు: 14 రోజులు హోం క్వారంటైన్
మధ్యప్రదేశ్: కరోనా లక్షణాలు ఉన్నవారికి 14 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి.
ఆంధ్రప్రదేశ్: 14 రోజులు ప్రభుత్వ లేదా హోం క్వారంటైన్
తెలంగాణ: కరోనా లక్షణాలు ఉంటే హాస్పిటల్కు పంపుతారు.
గోవా: కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. పరీక్షకు పంపి, ఫలితాలు వచ్చినంతవరకు ఐసోలేషన్లో ఉండాలి. పాజిటివ్ వస్తే హాస్పిటల్కు తరలిస్తారు. వారి కుటుంబాన్ని కూడా 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంచుతారు. నెగెటివ్ వస్తే 14 రోజులు ఇంటి నుంచి బయటకు రాకూడదు. క్వారంటైన్ నిబంధనల్లో కొన్నింటిపై స్పష్టత లేకపోవడం పైలట్లను అయోమయానికి గురిచేస్తోంది. రెండు నెలలుగా విమానాలు నడవకపోవడంతో చాలామంది తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. తిరిగి విధుల్లోకి చేరేందుకు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లిన తమను క్వారంటైన్లో ఉంచుతారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదని పలువురు పైలట్లు చెబుతున్నారు. విమానాన్ని నడుపుతూ తాము ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తే.. వేరే రాష్ట్రం నుంచి వచ్చాం కాబట్టి అక్కడ తమను క్వారంటైన్లో ఉంచుతారా? లేదా? అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉందని వారు పేర్కొన్నారు.