YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కిం కర్తవ్యం... మేధోమధనంలో టీడీపీ

కిం కర్తవ్యం... మేధోమధనంలో టీడీపీ

కిం కర్తవ్యం... మేధోమధనంలో టీడీపీ
గుంటూరు, మే 26,
టీడీపీ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. ఎక్కడా ప్రభుత్వం చిక్కడం లేదు. ఆ అవకాశం దొరకడం లేదు. గత ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో పార్టీ నేతలంతా కుంగిపోయి ఉన్నారు. వారు ఇంకా తేరుకోలేదు. ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా పార్టీ నేతలు యాక్టివ్ కావడం లేదు. గతంలో  జగన్, కేసీఆర్ కలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ గతంలో దుమ్మెత్తి పోసింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాకట్టుపెడతారా? అని నిలదీసింది. రాష్ట్రాన్ని ఎడారిని చేయడానికే జగన్ కేసీఆర్ తో చేతులు కలిపారని దుయ్యబట్టింది. కానీ జగన్ కామ్ గా తన పని తాను చేసుకుపోయారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి తెలంగాణతో తగువుకు సిద్ధమయ్యారు. ఈ అంశం కూడా తెలుగుదేశం పార్టీకి కలసి వచ్చేలా కన్పించడం లేదు.మరోవైపు జగన్ చెప్పినట్లు అన్ని ఆచరణలో పెడుతున్నారు. మద్య నిషేధం చేయాలంటూ ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు కూడా పార్టీ నేతల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. మద్యం దుకాణాలను తగ్గించడం, ధరలన పెంచడంతో ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని టీడీపీ జరిపిన అంతర్గత సర్వేలోనే తేలడంతో దీనిపై వెనక్కు తగ్గితే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశం ఎన్నికలకు ముందు తేవాల్సిన అంశమని సీనియర్ నేతలు కూడా చంద్రబాబుకు చెప్పారని తెలిసింది. ఇక ఇంగ్లీష్ మీడియం విషయంలోనూ జగన్ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం జరిపిన సర్వేలో ఇంగ్లీష్ మీడియంకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడంతో దీనిపైన కూడా పెద్దగా విమర్శించే అవకాశం టీడీపీకి లేకుండా పోయింది. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలోనూ వైసీపీ డీల్ చేసిన విధానం చూసి టీడీపీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏ అంశమూ ఏడాది గడుస్తున్నా తమకు కలసి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Related Posts