పొలిటికల్ పోలిసింగా...
విజయవాడ, మే 26
రాష్ట్రంలో పోలీసింగ్పై మాట్లాడాలంటే.. స్వోత్కర్షలకు, పరనిందలకు తప్ప మరో తావులేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర డీజీపీగా అసోంకు చెందిన గౌతం సవాంగ్ బాధ్యతలు చేపట్టి మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తికానుంది. ఈ ఏడాది కాలంలో పోలీసు వ్యవస్థను చూస్తే.. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగజారిందనేది వాస్తవం అంటున్నారు పోలీసు రిటైర్డ్ అధికారులే. తమను తాము పొగుడు కోవడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. మనసా వాచా.. ప్రజలకే అంకితం అవుతామని చెప్పుకొనే అనేక ప్రభుత్వ విభాగాల్లో పోలీసులు కూడా ఒకటి. అయితే, పనిఒత్తిడి, రాజకీయాల ప్రభావం తీవ్రంగా ఉండే ఈ వ్యవస్థ.. ప్రజలకు కనిపించే ప్రత్యక్ష ప్రభుత్వం.పోలీసు వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరగాలని అందరూ అనుకుంటారు. అయితే, రాష్ట్రంలో గడిచిన ఆరు మాసాల్లో రెండు సార్లు సాక్షాత్తూ డీజీపీనే హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అమరావతి రాజధానిలో రైతులు, మహిళలను వేధిస్తున్నారనే కేసులు ఇప్పటికీ .. హైకోర్టులో ఉన్నాయి. వీటిపై అంతర్జాతీయ స్థాయిలో కూడా కేసులు నమోదయ్యాయి. ఇక, లాక్డౌన్ నేపథ్యంలోనూ మితిమీరి వ్యవహరించి పోలీసులను చితకబాదిన పరిస్థితిపై ప్రజల నుంచే ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అదేసమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకుని, ఆయనను నిలువరించిన తీరును కూడా హైకోర్టు ఆక్షేపించింది.ఇక, ఇప్పుడు తాజాగా డాక్టర్ సుధాకర్ విషయంలోనూ హైకోర్టు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగింది. చేతులు వెనక్కి విరిచి కట్టి ఆయనను నడిరోడ్డుపై కొడతారా? అసలు ఆయనను ఏ సెక్షన్ కింద అరెస్టు చేశారు ? ఆయను ఏ కస్టడీలో ఉంచారు? అంటూ.. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు విశాఖ కమిషనర్ కోర్టు కు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు మనం అనుకున్నది చేసేద్దాం.. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది.. అనే రీతిలో పోలీసు వ్యవస్థ నానాటికీ.. మసిపడుతున్న పరిస్థితి కనిపిస్తోందని సీనియర్ పోలీసులే అనుకుంటున్నారు.తాను నిజాయితీగా ఉన్నప్పటికీ.. పోలీసుల ఆగడాలు భరించలేక పోతున్నామంటూ.. గుంటూరు, ప్రకాశం లో వ్యాపారులు తల్లడిల్లుతున్న పరిస్థితిని డీజీపీ పట్టించుకోక పోతే.. ఎలా? అనేది సీనియర్ల మాట ఇక, సీఐ స్థాయి అధికారులు కానిస్టేబుల్ స్థాయికి దిగిపోయి.. ఫోన్లలోనే బండ బూతులు అందుకోవడం, అధికార పార్టీ కాకపోతే.. చాలు.. వీరంగం వేయొచ్చనే స్థాయికి దిగజారడం.. నిజమైన పోలీసింగ్ ఎప్పటికీ కాదు. గతంలో ప్రభుత్వం నచ్చకనే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేశారు. అప్పుడు కూడా పోలీసు వ్యవస్థ పనితీరు ఇలానే ఉంది.అదేసమయంలో గత పోలీసింగ్ నచ్చకనే తాను డీజీపీని మారుస్తున్నానని జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. కానీ, కీలక పదవుల్లో వ్యక్తులు మారారే తప్ప.. వ్యవస్థలో మార్పు రాలేదని చెప్పడానికి తాజా పరిణామాలే ప్రబల నిదర్శనంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఏడాది పూర్తవుతున్న సమయంలో సవాంగ్ స్వోత్కర్షలకు దూరంగా ఉండి.. అసలు ఏం జరుగుతోందో.. తాను తన హయాంలో తీసుకువచ్చిన మార్పు ఏమిటో ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.