ఉపవాసదీక్ష చేపట్టిన కన్నా
గుంటూరు మే 26,
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీలో హిందూ ధర్మం మనుగడకు ప్రమాదం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షినారాయణ విమర్శించారు. హిందూ దేవాలయాలకు, దేవాలయాల భూముల విషయంలో జోక్యం చేసుకుంటే బీజేపీ చాలా తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. తిరుమల శ్రీవారి భూములను విక్రయించకుండా, కాపాడాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపట్టారు. కన్నా లక్షినారాయణ గుంటూరులో తన నివాసంలో ఉపవాస దీక్ష చేప్టటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి లక్ష్మీనిరసింహస్వామి భూములు, అన్నవరంలో భూములు తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు బీజేపీ వ్యతిరేకించిందని అన్నారు. ఇప్పుడు ఏకంగా తిరుమల శ్రీవారి భూములపై జగన్ ప్రభుత్వం కన్నేసిందని, దీనికి సంబంధించి జీవో కూడా ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు ఉపవాస దీక్ష చేపట్టామని కన్నా పేర్కొన్నారు. 888 జీవో ఒక పనికిమాలిన జీవో అని అయన వ్యాఖ్యానించారు.