భానుడి భగ భగ..విదర్భ విలవిల
హైదరాబాద్ మే 26
దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా హెచ్చు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త డాక్టర్ నరేశ్ కుమార్ తెలిపారు. హర్యానా, మధ్యప్రదేశ్, విదర్భ, రాజస్థాన్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే రెండు రోజుల తర్వాత స్వల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. భానుడి భగభగకు మధ్య భారతం విలవిలలాడుతున్నది. అనేక రాష్ట్రాల్లో 45 డిగ్రీల కన్నా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవాళ నాగపూర్లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మహారాష్ట్రలోని విదర్భలో మూడు రోజుల కోసం రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో అయిదు రోజుల తర్వాత విదర్భ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. పశ్చిమ, తూర్పు మధ్యప్రదేశ్లో కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజుల తర్వాత టెంపరేచర్ తగ్గే అవకాశం ఉన్నది. ఇక చత్తీస్ఘడ్లో రెండు రోజుల వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పంజాబ్లో కూడా సూర్య ప్రతాపం కొనసాగుతున్నది. అమృత్సర్లో ఇవాళ మధ్యాహ్నం 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న మరికొన్ని రోజుల పాటు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు.