తెలంగాణలో కమలసేనానులు
హైద్రాబాద్, మే 27,
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణకు విస్తరించాలని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఇందుకు పవన్ కళ్యాణ్ సహకారం కావాలని భావిస్తోంది. జనసేనాని అండగా కూడా తోడైతే తెలంగాణలో త్వరగా ఎదగవచ్చనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కలవడానికి కారణం కూడా ఇదే. ఇద్దరు నేతలు కలవడంతో రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఉత్సాహం నెలకొంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే, రాజకీయ నాయకుడిగా తనను అభిమానిస్తారా లేదా కేవలం సినిమా హీరోగానే ఆయనను ఇష్టపడతారా అనే విషయం పక్కన పెడితే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్కు ఎంతోకొంత అభిమానగణం ఉంది. దీంతో పవన్ను ఉపయోగించుకుంటే తమకు రాజకీయంగా కలిసి వస్తుందని తెలంగాణ బీజేపీకి నూతనంగా అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్ భావిస్తున్నారు. అందుకే ఆయనే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు.
రెండు రాష్ట్రాల రాజకీయాలు, ఇద్దరు ముఖ్యమంత్రుల వైఖరిపై వీరి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పని చేసిన అనుభవం పవన్ కళ్యాణ్కు ఉంది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల పక్షాన ఆయన ప్రచారం నిర్వహించారు.తర్వాత తెలంగాణ రాజకీయాలకు, బీజేపీకి దూరమయ్యారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో ఓటమి తర్వాత ఆయనే చొరవ తీసుకొని బీజేపీతో కలిశారు. ఇందుకోసం అప్పటివరకు కలిసి పనిచేసిన, బీజేపీ విరుద్ధ భావాలు, సిద్ధాంతాలు కలిగిన కమ్యూనిస్టులు, బీఎస్పీని పవన్ కళ్యాణ్ వదిలేశారు.అయితే, బీజేపీతో కలిసినా ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలూ కలిసి పెద్దగా కలిసి పని చేసిన, ఉద్యమించిన దాఖలాలు లేవు. అమరావతి కోసం కలిసి ఉద్యమించాలని, లాంగ్ మార్చ్ కూడా నిర్వహించాలని భావించినా అవేవీ జరగలేదు. ప్రస్తుతం ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు నామమాత్రంగా ఉంది. కానీ, తెలంగాణలో మాత్రం పవన్ కళ్యాణ్ అండ కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. పవన్కు ఉన్న క్రేజ్ను ఉపయోగించుకోవాలనుకుంటోంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తెలంగాణలో జనసేన ఉన్న కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులకు స్థానికంగా మద్దతు తెలిపింది.అయితే, తెలంగాణలో బీజేపీతో కలిసి పని చేయడానికి పవన్ కళ్యాణ్కు ప్రధాన అడ్డంకి ఒకటుంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు రాయలసీమ కరువు నివారణ పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టింది. ఈ ప్రాజెక్టును తెలంగాణలోని అన్ని పార్టీలు ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన ఏపీ ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం రాయలసీమ కోసం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏపీ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అడ్డుకున్నారు.ఏపీ ప్రయోజనాలను వ్యతిరేకిస్తున్న బండి సంజయ్ను కలవడం పట్ల పవన్ కళ్యాణ్పై ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. భవిష్యత్లో అయినా ఈ ప్రాజెక్టులపై తన వైఖరి ఏంటనేది పవన్ కళ్యాణ్ చెప్పాల్సి ఉంటుంది.అప్పుడు ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఆయన వైఖరి ఉన్నా మరో రాష్ట్రంలో ఇబ్బంది తప్పదు. తెలంగాణలో బీజేపీతో కలిసి పని చేసేందుకు ఈ ఒక్క సమస్య తప్ప పవన్ కళ్యాణ్కు ఎటువంటి అడ్డంకీ లేదు. మరి, ఈ సమస్యను సామరస్యంగా, రెండు రాష్ట్రాలకు వ్యతిరేకం కాకుండా తన అభిప్రాయం చెబితేనే పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయం చేయగలరు.ఇప్పటికే ఏపీకే పరిమితం కావాలని నిర్ణయించుకున్న వైసీపీ తెలంగాణపై ఆశలు వదులుకొని ఏపీ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు వెళుతోంది. టీడీపీకి కూడా జగన్ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మద్దతు తెలపడం కొంత రాజకీయంగా ఇబ్బందికరమే అయినా రెండు రాష్ట్రాల్లో ఏది కావాలో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏపీ ప్రతిపక్ష పార్టీగా, ఏపీలోనే భవిష్యత్ను వెతుక్కుంటున్న పార్టీగా తెలంగాణను వదిలేసుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉంటారు. మరి, పవన్ కళ్యాణ్ ఎటువంటి వైఖరితో వెళతారనేది ఆసక్తికరంగా మారింది.