లే అమ్మా..చనిపోయి న అమ్మపై ఉన్న దుప్పటిని తీస్తూ..
పాట్నా మే 27
రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు వారు.. బుక్కెడు బువ్వ కోసం.. గుక్కెడు నీళ్ల కోసం.. వలస కార్మికులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. లాక్డౌన్తో వలస కార్మికుల జీవితాలు ఆవిరైపోతున్నాయి. కొందరు తిండి లేక ఆకలితో అలమటించి కన్నుమూస్తున్నారు. మరికొందరు నిప్పులు కక్కే ఎండలో నడిచి నీరసించి పోయి చనిపోతున్నారు. ఓ తల్లి ఆకలితో అలమటించి.. నీరసించి పోయి కన్నుమూసింది. ఆమె తన పసిబిడ్డను ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఏమీ తెలియని అమాయక పాలబుగ్గల పసిపాప.. ప్రాణాలు విడిచిన అమ్మను లేపేందుకు ప్రయత్నం చేసింది. అమ్మపై ఉన్న దుప్పటిని తీస్తూ.. లే అమ్మా అంటూ అటు ఇటు చూస్తోంది. కానీ తన తల్లి ప్రాణాలు విడిచిందని ఆ అమాయకపు పసిబిడ్డకు ఏం తెలుసు? నోట మాట రాని ఆ పసిపాపకు దిక్కేవరు? ఇలాంటి ఆకలి చావులు లాక్డౌన్ కారణంగా దేశంలో ఎన్నెన్నో చూస్తున్నాం. లాక్డౌన్ కారణంగా ఇలాంటి ఆకలి చావులు చూసైనా ప్రభుత్వాలు కళ్ళు తెరువాలి.