ఏపీలో రంగుల రాజకీయం
విజయవాడ, మే 29,
జగన్ సర్కార్ కి రంగుల పిచ్చి ఎలా వచ్చిందో తెలియదు. నిజానికి జగన్ కి ఇలాంటివి అలావాటు ఉంటాయంటే ఎవరూ పెద్దగా నమ్మరు. ఎందుకంటే జగన్ కి ప్రచారం అంటే అసలు ఇష్టం ఉండన్నది తెలిసిందే. లేకపోతే ఒకటీ రెండూ కాదు, ఏకంగా 40 కి పైగా పధకాలు ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు. మరి వాటి గురించి ఎంతో కొంత చెప్పుకున్నా జగన్ కి వచ్చే ఎన్నికల్లో ఢోకా లేదు. కానీ జగన్ మాత్రం రంగుల రాజకీయంలో పూర్తిగా పడిపోయారు. ఏ పార్టీది ఏ గుర్తో జనాలకు చాలా బాగా తెలుసు. బాబు ఎన్నికల ముందు పసుపు కుంకుమ రూపేణా తన పార్టీ పసుపు గుర్తు కలసి వచ్చేలా మహిళలకు పందేరం చేశారు. అయినా గెలిచారా ఏంటి.జగన్ ఈ విషయంలో బాగా పంతం మీదనే ఉన్నారని అంటున్నారు. దానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. గతంలో మరుగుదొడ్లను సైతం వదలకుండా అయిదేళ్ల పాటు టీడీపీ పచ్చ రంగులు వేసి హడావుడి చేసింది. అపుడు ఎలాంటి గొడవలూ లేవు. పైగా అవన్నీ కూడా ప్రభుత్వ డబ్బులతోనే వేశారు. ఆఖరుకు అన్న గారి క్యాంటీన్ల మీద కూడా పసుపు రంగులేశారు. ఇక తెలంగాణాలో కూడా ఆరేళ్ళుగా గులాబీ రంగులు కనిపిస్తున్నాయి. ఇక్కడా అక్కడేంటి, దేశం మొత్తం మీద ఇలాగే రంగుల రాజకీయం నడుస్తోంది. దాంతో జగన్ వరకూ తీసుకుంటే తన ఒక్కడికే ఈ రూల్స్ ఏంటి అన్న బాధ ఉంటుందని అంటున్నారు.ఈ వాదనతో జగన్ సుప్రీం కోర్టుకు వెళ్ళబోతున్నారు. ఏపీలో కరోనా మహమ్మారి ఉంది. ఇపుడు ఖజానాలో పైసా కూడా ఆదాయం లేదు. రంగులు మార్చాలంటే కనీసంగా పదిహేను వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జగన్ సుప్రీం కోర్టుకు చెప్పబోతున్నారు. ఇపుడున్న ఆర్ధిక ఇబ్బందులు చెప్పి తన వాదనను ఆ కోణంలో చూపించాలనుకుంటున్నారు. అయితే జగన్ వాదనను సుప్రీం కోర్టు వింటుందా. అక్కడెలా తీర్పు వస్తుందన్నది ఆసక్తిగానే ఉంది.జగన్ కి అత్యంత ప్రజాదరణ ఉంది. పైగా చెప్పిన మాట ప్రకారం పధకాలు అమలు చేస్తున్నారు. అయిదేళ్ల పాటు మంచిగా పాలిస్తే జగన్ గుర్తు పెట్టుకుని మరీ గెలిపిస్తారు. ఇది ఒక్క జగన్ కే కాదు ఏ రాజకీయ పార్టీకైనా వర్తించే సూత్రం. జగన్ లాంటి వారు పార్టీ నేతల అత్యుత్సాహానికి తల ఒగ్గి ఇలా రంగుల రాజకీయంలో పడిపోవడం మంచి పరిణామం కాదనే వారు ఉన్నారు. ఇపుడు ఏపీకి డబ్బులు లేవన్నది కూడా నిజమే. కానీ భవిష్యత్తులోనైనా ప్రభుత్వ ఆఫీసులు అలాగే ఉంచి పాలన చేస్తేనే మేలు