ఉద్దానంలో మారని పరిస్థితులు
శ్రీకాకుళం, మే 29,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేశపరుడు. ఆలోచన లేకుండానే ఆయన స్టేట్ మెంట్లు ఇచ్చేస్తుంటారు. ఇది పవన్ కల్యాణ్ కు కొత్త కాదు. గత మూడేళ్ల నుంచి పవన్ కల్యాణ్ ను గమనిస్తున్న వారెవరైనా ఇది వాస్తవమని చెప్పగలరు. ప్రతి దానికి ఉద్యమం చేస్తామంటారు. ఆ తర్వాత దాని ఊసు కూడా ఎత్తరు. తాను ఉద్యమిస్తే ప్రభుత్వం దిగి వస్తుందని ఆయన భావించడం వల్లనే తరచూ ఉద్యమం అనే మాట ఎత్తుతారు. కానీ ఉద్యమం చేసింది లేదు. దిగింది లేదు. దీంతో ఆయన పరువును ఆయనే తీసేసుకుంటున్నారు.గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్దానం ప్రాంతానికి వెళ్లి అక్కడ పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించారు. అప్పటి ప్రభుత్వానికి 48 గంటల హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పవన్ కల్యాణ్ డిమాండ్ కు తలొగ్గి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు పింఛను ప్రకటించారు. ఇది తన వల్లనే సాధ్యమయిందని పవన్ కల్యాణ్ భ్రమపడ్డారు. ఉద్దానంలో నేటికి పరిస్థితులు అలాగే ఉన్నాయి. పింఛను తప్ప వారికి వైద్య పరంగా అందుతున్న సాయం అంతంత మాత్రమే. కానీ పవన్ కల్యాణ్ మళ్లీ ఉద్దానం వైపు తొంగి చూడలేదుఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత దాని ప్రస్తావనను పవన్ కల్యాణ్ తేవడం లేదు. ఇక రాజధాని రైతుల విషయంలో పవన్ కల్యాణ్ ఉద్యమం చేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని రైతులను పరామర్శించారు. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులను పెట్టి ప్రభుత్వం ఆమోదించింది. రేపో, మాపో రాజధాని తరలింపు తప్పదు. రాజధాని రైతులకు సంఘీభావంగా బీజేపీతో కలసి లాంగ్ మార్చ్ చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ తర్వాత పత్తా లేకుండా పోయారు.తాజాగా ఎల్జీ పాలిమర్స్ బాధితలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తానని ట్వీట్ ద్వారా పవన్ కల్యాణ్ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ బాధితలకు ప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించేసింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియో చెల్లించారు. ఐదు గ్రామాల్లో ప్రతి మనిషికి పదివేలు చెల్లించారు. ఇలా ప్రభుత్వం పరిహారం విషయంలోనూ, అక్కడ సదుపాయాల విషయంలోనూ శ్రద్ధ చూపుతున్నా పవన్ కల్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తానని ప్రకటించడం నవ్వు తెప్పించేలా ఉంది. అసలు పవన్ కల్యాణ్ కు ఉద్యమం దాని రూపురేఖలు తెలుసా? అని ప్రశ్నించారు.