జగన్ కు అమిత్ షా ఫోన్
న్యూఢిల్లీ, మే 29,
దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్డౌన్ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కరోనా వైరస్ నివారణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపు వంటి అంశాలపై శుక్రవారం ఫోన్లో వీరిద్దరు చర్చించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు సీఎం జగన్ వివరించారు.వైరస్ను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి 10 లక్షల మంది జనాభాకు దేశంలోనే అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మే 31వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాల పాటు ఆంక్షలను కొనసాగించాలని పలువురు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతుండగా.. సీఎం జగన్ అభిప్రాయాన్ని సైతం అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.ఇక దేశంలో లాక్డౌన్ పొడిగింపుపై శుక్రవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమిత్ షా భేటీ కానున్నారు. ముఖ్యమంత్రులు వెల్లడించిన సమాచారంపై వీరు చర్చించనున్నారు. లాక్ డౌన్ పొడిగించేది లేనిది ప్రధాని మోదీ ప్రకటించనున్నారు