పైలట్కు కరోనా..విమానం వెనక్కి
న్యూఢిల్లీ మే 30
లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ నుంచి ప్రత్యేకంగా విమానాలు పంపి అక్కడున్నవారిని స్వదేశానికి తీసుకొస్తున్నది. దీనిలో భాగంగా శనివారం ఢిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మార్గమధ్యలోనే వెనక్కి రప్పించారు. విమానంలోని పైలట్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని విమానయాన సంస్థ గ్రౌండ్ సిబ్బంది గుర్తించారని ఎయిర్ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 'వందే భారత్ మిషన్లో భాగంగా ఏ320 విమానం ప్రయాణికులు లేకుండానే మాస్కో బయలుదేరింది. ఉజ్బెకిస్థాన్ గగనతలంలోకి చేరుకునే సమయానికి పైలట్లలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్గా తేలిందని మా సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానం వెనక్కి రావాలని ఆదేశించాం. విమానం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి తిరిగొచ్చిందని' అధికారి వివరించారు.విమానంలో ఉన్న సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు. రష్యాలో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తామని ఆయన వెల్లడించారు.