ఇంటి దగ్గరకే బ్యాంకు సేవలు అందించేలా పోస్టల్ డిపార్ట్ మెంట్ కొత్త ప్రయోగానికి రెడీ అవుతోంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలను అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..బ్యాంకు సేవలు లేని గ్రామీణ ప్రాంతాల్లో తమ ఇళ్ల దగ్గరి నుంచే వినియోగదారులు నగదు లావాదేవీలు జరుపుకొనేలా తపాలా శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాయ్ పూర్, రాంచీలలో సక్సెస్ లు కావడంతో మిగిలిన ప్రాంతాల్లో అమల్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నారు. పల్లె ప్రజలు బ్యాంకు ఉన్న ప్రాంతానికి వచ్చి లావాదేవీలు జరుపుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆ శాఖ.. వారి ఇంటివద్దే సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 650 ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభించేలా కేంద్రం చర్యలు చేపడుతుంగా...తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశలో 23 ప్రాంతాల్లో అమలుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఉన్నతాధికారుల స్థాయిలో శిక్షణ ముగిసింది. కిందిస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనిలో అధికారులు ఉన్నారు. నెలన్నర లోపు ఇంటి వద్దనే బ్యాంకు సేవలు అందించేలా ఉన్నతాధికారులు ముమ్మరంగా చర్యలు చేపడ్తున్నారు. కాగా, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థగా సేవలందించేలా తపాలశాఖ చర్యలు చేపడుతోంది. ఎటువంటి పుస్తకాలు లేకుండానే కేవలం ఆధార్ నెంబర్, వేలి ముద్ర ఉంటే చాలు.. నగదు లావాదేవీలను వినియోగదారులకు అందించనుంది. కేవలం రూ.వంద చెల్లించి వినియోగదారులు సమీపంలోని పోస్టాఫీసుల్లో ఖాతా తెరుచుకోవాల్సి ఉంటుంది. కరెంటు, నల్లా, ఇతరాత్రాబిల్లులను ఈ పథకం ద్వారా చెల్లించుకోవచ్చు. పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు సాగించేందుకు గతేడాది జనవరి 20న ఐపీపీబీకి ఆర్బీఐ లైసెన్సు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీపీబీ గతేడాది జనవరి 30న ప్రయోగాత్మకంగా రాయ్పూర్ (చత్తీస్గఢ్), రాంచీ (జార్ఖండ్)లో రెండు శాఖలను మాత్రమే ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా శాఖలను విస్తరించలేదు.దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్న ఐపీపీబీ.. వీలును బట్టి మొత్తం పోస్టాఫీసులన్నింటినీ (సుమారు 1.55 లక్షలు) బ్యాంకింగ్ పథకాలు, సర్వీసులను అందించడానికి ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు మనోజ్ సిన్హా తెలిపారు. మరోవైపు, ఇతర బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలతో కూడా ఐపీపీబీ ఒప్పం దాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి వ్యక్తపర్చాయని, ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకు, పీఎన్బీ మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఐపీపీబీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మనోజ్ సిన్హా చెప్పారు.తమ ఖాతాల్లోని డబ్బులను ఇతర ఖాతాల్లోకి, ఇతరత్రా లావాదేవీలకు ట్రాన్స్ఫర్ చేసుకునే వీలును పోస్టల్ శాఖ కల్పిస్తోంది. ఈ పథకంలో లోన్ సౌకర్యం మాత్రంలేదని అధికారులు పేర్కొంటున్నారు. అనేక గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ప్రజలకు అందుబాటులో లేవు. మండల, నియోజకవర్గ కేంద్రాలకు, సమీపంలో ఉన్న పట్టణాలకు పల్లె వాసులు వెళ్లాల్సి వస్తుంది. తపాలశాఖను బలోపేతం చేసుకునే క్రమంలోనే మారు మూల గ్రామాల్లోనూ ఇంటి వద్దే ఉంటూ నగదు లావాదేవీలు నిర్వహించుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని తపాలశాఖ కు చెందిన డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ వి.వి. సత్యనారాయణరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. వారికి డబ్బులు పంపించాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరంలేదు. మా సిబ్బందికి చెబితే వారే వాళ్ల ఇంటి వద్దకు వెళ్తారు, నగదును ఏ బ్యాంకు ఖాతా ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏ బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల నైనా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.