ఆరేళ్లలో ఎంతో ప్రగతి
ధాన్యాగారంగా మారుతున్న తెలంగాణ కలిసొచ్చిన విద్యుత్ సంస్కరణలు
(జూన్ 2 తెలంగాన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...)
ఆరేండ్ల నాడు నిజమైన కల.. వందేండ్ల ప్రగతికి పునాదులేసింది. మెట్టపంటలతో నెట్టుకొచ్చిన భూములు మంచి మాగాణాలై మెరిసిపోతున్నాయి. ఉపాధి కరు ఆరేండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలన రైతు ముఖంలో చిరునవ్వు తెచ్చింది ధాన్యపు సిరులతో కళకళలాడుతున్నాయి. ఏడాది పొడవునా దిగువకు పరవళ్లు తొక్కే కృష్ణా, గోదావరిజలాలు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల మంత్రంతో బీడు భూములను పావనం చేస్తున్నాయి. నీటి కోసం అల్లాడిన నేల నిండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్నట్లు జలకళలాడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల ద్వారా 70 లక్షల ఆయకట్టుకు పుష్కలమైన సాగునీరు అందుతున్నది. మరో 15.71 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం కేవలం ఆరు సంవత్సరాల్లోనే 85.71 లక్షల ఎకరాలకు జీవం పోసింది.తెలంగాణ ఏర్పడిన తర్వాత కోయిల్సాగర్, అలీసాగర్, గుత్ప, భక్త రామదాసు, సింగూరు ప్రాజెక్టు కాల్వల వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేసిన ప్రభుత్వం రాలివాగు, గొల్లవాగు, మత్తడివాగు, గడ్డెన్న-సుద్దవాగు, చౌటుపల్లి హన్మంతరావు, కిన్నెరసాని వంటి మధ్యతరహా ప్రాజెక్టుల్ని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం గత ఆరేండ్లలో ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించింది. వీటిని పూర్తి చేసినట్లయితే వెంటనే సాగునీరు అందించే అవకాశమున్నందున ప్రాధాన్యతా క్రమంలో వీటికి నిధులు కేటాయిస్తూ సాగు విస్తీర్ణాన్ని పెంచింది. ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో 83 శాతం కేవలం ఆన్గోయింగ్ ప్రాజెక్టులపైనే ఖర్చు చేసింది. ఐటీ రంగంలో దేశానికి గమ్యస్థానంగా నిలుస్తున్నది తెలంగాణ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఐటీ ఎగుమతుల్లో మేటిగా నిలిచి ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు సురక్షితమైన నగరంగా నిలుస్తున్నది. ఐటీలో జాతీయవృద్ధి రేటుతో పోలిస్తే మన రాష్ట్రం రెండింతలకు పైగా అభివృద్ధిని సాధించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక భారత జాతీయ సగటే కాదు దేశంలోని ఇతర రాష్ర్టాలు నమోదు చేయని వృద్ధిని సాధించింది. ప్రతి సంవత్సరం వృద్ధిని సాధిస్తూ కోట్లాది రూపాయల ఎగుమతులతో పాటు అనేక మందికి ఉద్యోగాల ద్వారా ఉపాధి కల్పిస్తోంది. కరోనా కష్టకాలంలో ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆరేండ్లలో ఎగుమతులు రెట్టింపు కాగా 2.10లక్షల మందికి అదనంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. 2019-20 ఏడాదికి రాష్ట్ర ఐటీ ఎగుమతులు 17.93 శాతం పెరిగాయి. తెలంగాణ ఎగుమతులు జాతీయ స్థాయిలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 10.60 శాతం నుంచి 11.60 శాతానికి పెరిగాయి. జాతీయ స్థాయిలో 8.09 శాతం ఎగుమతులు కావడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన జూన్ 2, 2014 నాడు తెలంగాణ యావత్తూ ఎటుచూసినా.. చీమ్మ చీకట్లే కనపడేవి. అప్పటి విద్యుత్ డిమాండ్లో 2700 మెగావాట్ల లోటుతో ఉన్న పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధి జరగదని గ్రహించిన సీఎం కేసీఆర్.. ముందుగా విద్యుత్ రంగానికి చికిత్స మొదలెట్టారు. 2014 నవంబర్లోనే గృహ, వాణిజ్య, వ్యాపార, పరిశ్రమలకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ను అందివ్వడం ప్రారంభించడం వెనుక సీఎం మార్గదర్శనం.. సీఎండీ సారధ్యం.. విద్యుత్ ఉద్యోగుల అవిరళ కృషి ఉంది. అలాగే రాష్ట్ర అవసరాలను తీర్చేలా విద్యుత్ కొనుగోళ్లు.. వ్యవస్థలను పటిష్టపర్చడం.. సొంత రాష్ట్రంలోనే విద్యుత్ ఉత్పత్తికి నడుంకట్టడం లాంటివి అనేకం ప్రభావితం చూపాయి. దీనికితోడు.. 1000 మెగావాట్లకు చత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం, ఉత్తరాదిని దక్షిణ భారతంతో కలిపేలా 765 డబుల్ సర్క్యూట్ లైన్ను త్వరితంగా పూర్తిచేసేలా చూడటం మనకు కలిసివచ్చింది. ఇక వరంగల్తో పాటుగా నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ లాంటి నగరాల్లో ఐటీ టవర్లను నిర్మిస్తున్నారు. వరంగల్ ఐటీ టవర్ ప్రారంభం కాగా కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది. త్వరలో నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ ఐటీ టవర్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్లో సయెంట్, టెక్ మహేంద్ర కంపెనీలు వరంగల్లో తమ కంపెనీలను ప్రారంభించాయి. హైదరాబాద్ ప్రపంచంలోనే డైనమిక్ సిటీగా అవతరించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలే ప్రధాన కారణం. ఒకవైపు పట్టణాల్లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తూ.. మరోవైపు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయాల్ని తీసుకుంటున్నది. అందుకే, తెలంగాణలో పెట్టుబడుల్ని పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. జోన్స్ లాంగ్ లసాల్ (జేఎల్ఎల్) విడుదల చేసిన 2020 సిటీ మూమెంటం ఇండెక్స్లో భాగ్యనగరం డైనమిక్ సిటీగా అవతరించింది. జేఎల్ఎల్ విడుదల చేసిన సిటీ ఇండెక్స్లో హైదరాబాద్ టాప్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా 130 నగరాలు దీనికి పోటీ పడ్డాయి.టీఎస్ఐపాస్ గత ఐదు సంవత్సరాల్లో దాదాపుగా 12వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలనేదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన ఈ ఆలోచన ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రగామి సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను స్థాపించాయి. 12,290 పరిశ్రమలు అనుమతులు తీసుకున్నారు. వీటి ద్వారా రూ.1,98,511 కోట్లు పెట్టుబడులు రాగా 13.97లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. వీటిలో ఇప్పటి వరకు 9236 పరిశ్రమలు తమ వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించగా వీటి ద్వారా రూ.86,867కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయి. వీటితో 6,37,654 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ప్రపంచానికి అవసరమయ్యే వాక్సిన్లలో మూడో వంతు మన దగ్గర నుంచే ఎగుమతి అవుతున్నాయి. తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వ్యాక్సిన్ కూడా హైదరాబాద్ నుంచే తయారవుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. భారతదేశంలో ఆరు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయత్నిస్తుంటే ఇందులో భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్, బయోలాజికల్ కంపెనీలు తెలంగాణవే. 19వేల ఎకరాల్లో ఫార్మా సిటీ, మరో వైపు జీనోమ్ వ్యాలీ, సుల్తాన్పూర్లో మెడ్టెక్ పార్క్ వంటి లైఫ్సైన్సెస్ పరిశ్రమలు ఏర్పాటయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఉత్తరాన గోదావరి.. దక్షిణాన కృష్ణా.. ముక్కోటి దేవతలు కొలువైన ప్రాంతం.. అకుపచ్చని అరణ్యాలకు నెలవైన రాష్ట్రం తెలంగాణ. ప్రపంచ స్థాయికి దీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నప్పటికీ సమైక్య పాలనలో అంధకారంలో ఉండిపోయాయి. ఇక్కడి పండుగలు, జాతరలు, సంస్కృతి నిరాదరణకు.. నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన ఈ ఆరేండ్ల కాలంలో ఇవన్నీ పూర్వ వైభవం సంతరించుకున్నాయి. మన భాషకు గౌరవం దక్కింది. వేషానికి ఆదరణ లభించింది. సంస్కృతి సజీవమైంది. తెలంగాణ భాష ఒకప్పుడు సినిమాల్లో విలన్లు.. కమెడియన్లు మాట్లాడే భాష. ఇప్పుడు హీరోలు మాట్లాడే భాష. ఈ మార్పు ఎలా సాధ్యమైంది? కేసీఆర్ ఎంత ప్రోత్సహించారనేది యావత్ ప్రపంచానికి తెలుసు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ జేయడంతో పాటు కవులు, రచయితలకు సరైన గుర్తింపు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించింది.పర్యాటకంగా తెలంగాణ మిగతా రాష్ర్టాలకన్నా ముందంజలో ఉంది. బొగత, భీమునిపాదం, మల్లెల తీర్థం, సబ్బితం, పొచ్చెర, గుండాల, కుంతాల.. వంటి ఎన్నో జలపాతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. గోదావరి, కృష్ణ నదుల్లో విహరించేందుకు ప్రారంభించిన బోట్ ప్యాకేజీలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్లోని చారిత్రక కట్టడాల వైపు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్స్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. డివైన్ డెస్టినేషన్స్, హెరిటేజ్ స్పాట్స్, నేచర్ డిస్కవరీ, వైల్డ్ లైఫ్, అడ్వెంచర్ జర్నీస్ వంటి ప్రత్యేక కార్యక్రమాలతో పర్యాటకంగా ఫరిడవిళ్లుతున్నది.