అన్నలు అలా.. తమ్ముడు ఇలా
హైద్రాబాద్, జూన్ 1,
పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయం చేస్తానని చెప్పి పార్టీ పెట్టారు. ఆయన రాజకీయ సిధ్ధాంతాల్లో అనవసర విమర్శలు ఉండవు, సూచనలు ఉంటాయి. ఇక రాజకీయ ప్రత్యర్ధులు ఉండరు, ప్రజల కోసం మాత్రమే పనిచేసే సాటి వారు, పోటీదారులు మాత్రమే ఉంటారు. అనవసరంగా నోరు పారేసుకోవడం, నిందలు, తిట్లు వంటివి తన ఒంటికి పడని రాజకీయాలు అని ఆరంభంలో పవన్ చెప్పుకున్నారు. మంచి చేస్తే ఎవరినైనా మెచ్చుకోవాలని కూడా ఆయన ప్రవచించారు. కానీ పవన్ చెప్పిన దాన్ని తానే ఆచరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వం అయినా చెడ్డ పనులే చేయదు, మంచి పనులూ కూడా చేస్తుంది. మరి పొరపాట్లు చేస్తే గయ్యిమని లేచి గర్జించే పవన్ కళ్యాణ్ మంచి చేస్తే మాత్రం మెచ్చుకోక మౌనం వహించడంపైన విమర్శలు వస్తున్నాయి.జగన్ ని వరసపెట్టి మెగాబ్రదర్స్ మెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంగతి చెప్పనవసరం లేదు. ఆయన జగన్ కుటుంబంతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఏకంగా కుటుంబసమేతంగా జగన్ ఇంటికి వెళ్ళి విందారగించి మరీ వచ్చారు. ఇక జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్ధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక తాజాగా తెలుగు సినిమాకు జగన్ సింగిల్ విండో విధానంలో పర్మిషన్లు మంజూరు చేయడం, ఏపీలో ఉచితంగా షూటింగులు జరుపుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మీద కూడా చిరంజీవి సానుకూలంగా స్పందించారు. ఏకంగా జగన్ కి ఫోన్ చేసి మరీ ధన్యవాదాలు చెప్పారు. తొందరలో ఏపీ ముఖ్యమంత్రిని స్వయంగా కలుస్తానని కూడా చెప్పుకున్నారు.ఇక మెగా బ్రదర్ గా పేరు పొందిన నాగబాబు కూడా జగన్ ని అభినందించడం విశేషం. ఆయన జనసేనలో ఉన్నారు. జగన్ నిర్ణయాలను తరచూ తప్పుపడుతూ ఉంటారు. అటువంటి మెగా బ్రదర్ ఆశ్చర్యకరంగా జగన్ ని అభినందించారు. అదేంటి అంటే టీటీడీ భూముల వేలానికి సంబంధించీ జీవోను జగన్ రద్దు చేయడాన్ని నాగబాబు స్వాగతించారు. ఇది నిజంగా మంచి పరిణామమే. టీటీడీ భూముల వేలం మీద బీజేపీ, టీడీపీతో పాటు జనసేన కూడా గట్టిగానే మాట్లాడింది. మొత్తానికి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆ సమయంలో సర్కార్ చర్యలను అభినందించడం రాజకీయ నేతల కనీస బాధ్యత. నాగబాబు అదే చేశారు.మెగా కుటుంబంలో ఇద్దరు అన్నలు జగన్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు. మరి తమ్ముడు మాత్రం మౌనంగా ఉంటున్నారు. అయిన దానికీ కానిదానికీ విరుచుకుపడడమే కాదు, సమయం సందర్భం చూసి ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతుగా మాట్లాడితేనే జనంలో విశ్వసనీయత పెరుగుతుంది. నాయకులు చేసే విమర్శల పట్ల జనానికి గురి కుదురుతుంది. పవన్ కళ్యాణ్ తన కొత్త రాజకీయమంటూ చెప్పింది ఇదే. కానీ ఆచరణలో ఆయన వంటట్టించుకోలేకపోతున్నారంటే విడ్డూరమే. ప్రభుత్వాన్ని అభినందించినంతమాత్రాన కొంపలేమీ మునగవు, పైగా జనంలో విలువ పెరుగుతుంది. పాలకులు కూడా ఇకపైన నేతల విమర్శలను సీరియస్ గా తీసుకుంటారు. అదే పనిగా విమర్శలు చేయడమే చేస్తూంటే వారిని పాలకులూ, ప్రజలు పక్కన పెడతారు, ఇంత చిన్న లాజిక్ కి పాతికేళ్ళు రాజకీయం చేస్తానని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మిస్ కావడమే విశేషం. ఏది ఏమైనా పవన్ కూడా తన పంధా మార్చుకుంటేనే చంద్రబాబు మార్క్ విద్వేష రాజకీయాల ప్రభావం నుంచి బయటపడతారని అంటున్నారు