మజ్లిస్ పార్టీ ఎన్ని అవాంతరాలు సృష్టించినా.. వారికి ఎదురొడ్డి నిలిచి పార్టీ నిర్మాణానికి కృషి చేసిన గొప్ప నేత ఆలె నరేంద్ర అని, ఆలే నరేంద్ర పార్టీలో కీలకంగా ఉన్న సమయంలో ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించేవి కావని, బిజెపిలో నరేంద్ర అంటేనే ఒక చరిస్మా ఉండేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆలె నరేంద్ర నాలుగో వర్థంతి సమావేశంలో డాక్టర్ లక్ష్మన్ మాట్లాడారు. ఆలె నరేంద్ర పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన బాటలో పార్టీ కార్యకర్తలు, నేతలు నడవాల్సిన అవసరం ఎంతో ఉందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి.. జీవితాంతం పార్టీ నిర్మాణానికి కృషి చేసిన గొప్ప నేత ఆలె నరేంద్ర అని, తెలంగాణలో బిజెపి బలోపేతానికి విశేష కృషి చేసిన ఆలె నరేంద్రను..ఈనాటి యువతరం, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలం దేశాన్ని పాలించినా..ప్రజలకు ఒరిగిందేమీలేదని, మొదటి నుంచి కాంగ్రెస్ దళితుల పట్ల అవమానపరిచే దోరణిని చూపిస్తుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని, అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాలులో పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే బాబూ జగ్జీవన్ రామ్ను ప్రధాని కాకుండా అడ్డుకున్నది కూడా కాంగ్రెస్సేనని డాక్టర్ లక్ష్మ,న్ విమర్శించారు. దళితుల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ఇవాళ దళితులు మోదీపాలన పట్ల ఆకర్షితులవుతున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న అనేక ఘట్టాలను పంచతీర్థ్ పేరిట మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ముఖ్యంగా అంబేద్కర్ జన్మస్థలం మౌ గ్రామం, ఆయన చదివిన లండన్, న్యూఢిల్లీ, నాగ్పూర్ వంటి ప్రాంతాలను స్ఫూర్తి కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలు తీర్చిదిద్దారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో అన్ని వ ర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలను ఆస్వాదిస్తున్నారని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపికి పట్టం కడుతున్నారన్నారు. పేదరికం నుంచి వచ్చిన మోదీ ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదని, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి.. వాటిని అమలు చేస్తున్నారన్నారు.ఆలె నరేంద్ర ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, నరేంద్ర కోరుకున్న రామమందిర నిర్మాణం కల సాకారం కావాలని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు జి కిషన్రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వర్రావు, , బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాపారావు, రాష్ట్ర కార్యాలయ ప్రముఖ్ దాసరి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.