తెరపైకి కొత్త ఎస్ఈసీ
విజయవాడ, జూన్ 3
నిమ్మగడ్డ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను విత్ డ్రా చేసుకుంది ప్రభుత్వం. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో తీర్పు అమలుపై స్టే కోరుతూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. కాసేపటికే పిటిషన్ విత్ డ్రా చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గంటలోనే నిర్ణయం మార్చుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందోనని ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. వేసవి తగ్గిన అక్కడ రాజకీయాల్లో వేడి మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం పెద్ద దుమారమే రేగుతోంది.కరోనా పేరు చెప్పి స్థానిక ఎన్నికలను రద్దు చేశారని ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో సీఎం జగన్ సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్ట్ తీర్పుతో తాను తిరిగి బాధ్యతలు చేపడుతున్నట్టు ఒక సర్క్యులర్ కూడా ఆయన జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం ఆయన మరోసారి ఎస్ఈసీగా కొనసాగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషనర్ గా కొత్త వ్యక్తిని నియమించే అవకాశాలు మెండుగా వున్నాయని బెజవాడలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు రమేష్ కుమార్ ని ఎన్నికల సంఘం అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కొనసాగించకపోవచ్చు. రమేష్ విషయంలో ఏం చెయ్యాలా అనే దాని మీద కసరత్తులు చేస్తోంది ఏపీ సర్కార్. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కమీషనర్ పదవి దాదాపుగా ఖాళీ గా ఉంది. దీని ద్వారా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్టయింది. నిమ్మగడ్డ తర్వాత ఏపీ ఎన్నికల కమిషననర్గా బాధ్యతలు చేపట్టిన కనగరాజ్ కూడా హైకోర్ట్ తీర్పుతో పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే ఆలోచనలో వున్నారు జగన్. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు మెట్లెక్కింది ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కార్. హైకోర్ట్ తీర్పుపై సుప్రీం కోర్ట్ స్టే ఇస్తే మాత్రం కొత్త కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ను నియమించేందుకు పావులు కదుపుతోంది. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందోనని రాజకీయవర్గాలు సైతం తాజా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.