YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ దేశీయం

యజమాని వద్ద కూతురు తాకట్టు

యజమాని వద్ద కూతురు తాకట్టు

యజమాని వద్ద కూతురు తాకట్టు
హైద్రాబాద్, జూన్ 2,
అసలే పేదరికం.. ఇద్దరు ఆడపిల్లలు.. ఇంతలో ఇంటి పెద్ద అనారోగ్యంతో కాలం చేశాడు. ఆ ఇల్లాలిపై బండెడు భారం పడింది. అయినా.. గుండె దిటువు చేసుకుంది. ఇద్దరు పిల్లలనూ ఎలాగైనా చదివించాలనుకుంది. అందుకోసం 30 వేల రూపాయలు అప్పు చేసింది. రెక్కలు ముక్కలు చేసుకొనైనా ఆ అప్పు తీర్చుకుంటానని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. కానీ, తానొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. చూస్తుండగానే ఆ చిన్న అప్పు తలకు మించిన భారంగా మారింది. చేసేదేంలేక పెద్ద కుమార్తెను బంధువుల దగ్గర వదిలేసి, చిన్న కుమార్తెను తీసుకొని హైదరాబాద్ వలస వచ్చింది. ఓ ఇటుకల బట్టీలో తల్లీ కుమార్తెలిద్దరూ పనికి కుదిరారు. జీవితం కాస్త గాడిన పడుతుందనకుంటున్న దశలో విధి మరోసారి కాటు వేసింది. ఈసారి ఆ మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. ఆస్పత్రి ఖర్చులు, మందుల కోసం ఇటుకల బట్టీ యజమాని వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఇంటికి వెళ్లొచ్చి ఆ అప్పు తీరుస్తానని ఆ యజమానికి చెప్పింది. 16 ఏళ్ల తన చిన్న కుమార్తెను యజమాని వద్ద తాకట్టు పెట్టి స్వగ్రామానికి వెళ్లింది. ఆరోగ్యం విషమించడంతో ఆ తల్లి అక్కడే కన్నుమూసింది.యజమాని వద్దే ఉండిపోయిన చిన్న కుమార్తె తన తల్లి కడచూపునకు కూడా నోచుకోలేకపోయింది. ఒడిశాలోని నవరంగాపూర్‌ జిల్లా చందాహండి సమితికి చెందిన పేద కుటుంబం కన్నీటి గాథ ఇది. ఇలాంటి కష్టం శత్రువులకు కూడా రావొద్దు. ఆ తల్లీకూతుళ్ల కష్టాల గురించి వింటుంటే.. గుండె తరుక్కుపోతోంది.గ్రామానికి చెందిన కొంత మంది మానవతా వాదులు ఆ ఆడబిడ్డల కష్టం గురించి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్ నేత, నవరంగాపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ పెద్ద మనసు చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఇటుకల కంపెనీ యజమాని వద్ద ఉన్న చిన్న కుమార్తె సాగరిక (16)ను విడిపించారు.మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ ఆదేశాలతో చందాహండి సమితి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేశ్వర హింస హైదరాబాద్‌ వచ్చారు. ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల అధికారులతో పాటు ఇటుకల కంపెనీ యజమానితో మాట్లాడి సాగరికను పంపించాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించడంతో సాగరిక విముక్తి పొంది శనివారం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి  సాయంత్రం నవరంగాపూర్‌ చేరుకుంది. ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న ఆ బాలిక అక్క ప్రియాంక.. చెల్లెలు రాగానే ఆమెను హత్తుకొని కన్నీరుమున్నీరైంది. ఆ దృశ్యం మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ సహా అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది.హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన సాగరిక తన గోడును ఒడిశా ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు తెలిపింది. అయితే ఎవరూ స్పందించలేదని చెప్పింది. ఆ బాలికను రక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరికి మాజీ ఎంపీ ప్రదీప్‌ మాఝీ పెద్ద మనసు చేసుకోవడంతో ఆ బాలిక తన అక్క వద్దకు చేరుకుంది.కాంగ్రెస్‌ నేతలు ఆ అక్కాచెల్లెళ్లను ఓదార్చి వారికి వచ్చిన కష్టాన్ని మీడియాకు తెలిపారు. సాగరిక తాను అనుభవించిన బాధల గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది. హైదరాబాద్‌ నుంచి ఇటుకల బట్టీ యజమాని సుబ్బారావు ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. సాగరిక తల్లి అనారోగ్యం వల్ల ఇంటికి వెళ్లిందని.. ఆమె మరణించిన విషయం తెలిసి సాగరికను పంపించాలని భావించామని తెలిపారు. అయితే.. లాక్‌డౌన్‌ కారణంగా పంపించలేకపోయానని చెప్పారు.తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆ అక్కాచెలెళ్లను ప్రభుత్వం ఆదుకోవాలని.. వారికి ఉన్నత చదువులు చెప్పించాలని నవరంగాపూర్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Related Posts