అలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుఫాన్
ముంబాయ్ జూన్ 3
నిసర్గ తుఫాన్.. తీరాన్ని తాకింది. మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద .. తుఫాన్ వల్ల వర్షం పడుతోంది. మరో మూడు గంటల్లో నిసర్గ సంపూర్ణంగా తీరం దాటనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. ముంబై సమీపంలో ఉన్న అలీబాగ్ వద్ద సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ నేపథ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు వందేళ్ల తర్వాత ముంబై తీరాన్ని తుఫాన్ తాకనున్నది. మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 40 వేల మందిని, గుజరాత్లో 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. గుజరాత్లో 15 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. దక్షిణ గుజరాత్లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు.