YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం

 తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం

 తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం
ఇవాళ బోర్డు మీటింగ్
హైద్రాబాద్, జూన్ 3,
కృష్ణా, గోదావరి నదీ జలాలపై నెలకొన్న వివాదాలపై వాదనలను బలంగా వినిపించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. తమకు రావలసిన కేటాయింపుల్లోంచే తెలంగాణలో నీటిని వినియోగించుకుంటున్నామనిన కృష్ణా, గోదావరి బోర్డు బేటీల్లో బలంగా వాదించాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మళ్లంపు జలాల్లో తనకు దక్కాల్సిన వాటాలపై రేపు, ఎల్లుండి జరిగే కృష్ణా, గోదావరి బోర్డు భేటీల్లో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. కాగా, దుర్భిక్షంతో తడారిన రాయలసీమ గొంతుక తడపడానికే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని కృష్ణా బోర్డుకు మరోసారి స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ రాష్ట్రానికి కేటాయించిన వాటా ప్రకారం నీటిని వాడుకోవడానికే ఎత్తిపోతల చేపట్టామని వివరించేందుకు సిద్ధమైంది.
కృష్ణా, గోదావరి జలాలనుంచి తనకు రావలిసిన వాటాపై బోర్డుల ముందు వాదించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. గత ట్రిబ్యునళ్ల తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులు, దక్కాల్సిన వాటాలు, వినియోగిస్తున్న జలాలపై నివేదికలు సిద్ధం చేసుకుంది. ఏపీ అభ్యంతరం చెబుతున్న ప్రాజెక్టుల పై వాదన వినిపించడంతోపాటు మళ్లింపు జలాల్లో దక్కే వాటాలపై ఈ నెల 4న జరిగే కృష్ణా బోర్డు, 5న జరిగే గోదావరి బోర్డు భేటీల్లో తేల్చుకోనుంది. అపెక్స్‌ కౌన్సిల్, బోర్డు అనుమతి లేదని చెబుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ఈ ఏడాదిలో ప్రాజెక్టుల్లో నీటి, విద్యుత్‌ పంపిణీ, బోర్డులకు రావాల్సిన నిధులు, సిబ్బంది కేటాయింపు అం శాలను బోర్డులు ఎజెండాలో చేర్చాయి.కృష్ణా, గోదావరి బోర్డు భేటీల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీ ఎం కేసీఆర్‌ ఇంజనీర్లకు మార్గదర్శనం చేశారు. మంగళవారం ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, హరిరామ్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండేతో ఆయన సమీక్షించారు. గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలను బోర్డు ముందు పెట్టాలని సూచించారు. గోదావరిలో 954 టీ ఎంసీల వినియోగంపై జరిగిన ఒప్పందాలు, శ్రీకృష్ణ కమిటీలో పొందుపరిచిన అంశాలను ప్రస్తావిస్తూ ఆ కేటాయింపుల్లోంచే వినియోగించుకుంటున్నామనేది గట్టిగా చెప్పాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల, దుమ్ముగూడెం, పాలమూరు, డిండి ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్‌ చేయడాన్ని బోర్డుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. గతేడాది వాటర్‌ ఇయర్‌లో వినియోగించే హక్కు కలిగి ఉండి కూడా వాడుకోని నీటిని ఈ వాటర్‌ ఇయర్‌లో తమకే ఇవ్వాలని కృష్ణాబోర్డును కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్‌ పరిధిలో గడిచిన వాటర్‌ ఇయర్‌లో తెలంగాణ 50 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉండగా, ఆ కోటా అలాగే ఉండిపోయింది. ఈ నీటిని జూన్‌ 1 నుంచి మొదలైన వాటర్‌ ఇయర్‌లో తెలంగాణ కోటా కిందే పరిగణించాలని కోరనుంది. ఏటా వాటర్‌ ఇయర్‌ జూన్‌ నుంచి మే చివరి వరకు ఉంటుంది.జూన్‌ నుంచి కొత్త వాటర్‌ ఇయర్‌ ఆరంభమవుతుంది. జూన్‌ నుంచి ప్రాజెక్టుల్లో ఉండే నీటి లభ్యత, వచ్చిన ప్రవాహాలు, రాష్ట్రాల అవసరాల మేరకు కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తుంది. గతేడాది 3466 నిష్పత్తిన రెండు రాష్ట్రాలకు నీటిని పంచింది. ఇందులో ఏపీ తన కోటాకు మించి వినియోగించగా, తెలంగాణకు మాత్రం బోర్డు కేటాయించిన లెక్కల మేరకు మరో 50 టీఎంసీల మేర నీటిని   వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నీరంతా సాగర్‌లోనే ఉంది. సాగర్‌లో ప్రస్తుతం 531 అడుగుల పరిధిలో 170 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన లభ్యత మరో 50 టీఎంసీల మేర ఉంది. ఈ వాటా అంతా తెలంగాణదేనని ఇటీవలే బోర్డు స్పష్టంచేసింది. అయితే మే 31తో వాటర్‌ ఇయర్‌ ముగియడం, జూన్‌ నుంచి కొత్త వాటర్‌ ఇయర్‌ ఆరంభం కావడంతో కొత్త వాటాలు తెరపైకి వస్తాయి. దానికి అనుగుణంగానే బోర్డు పంపకాలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది గరిష్ట నీటిని వినియోగించుకోలేకపోవడంతో తన వాటాను ఈ ఏడాది కింద దక్కే వాటాలో కలపాలని తెలంగాణ కోరనుంది. ఈ నెల 4న జరిగే బోర్డు భేటీలో ఈ అంశం కీలకం కానుంది. సీమ గొంతుక తడపడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం: ఏపీ వాదన మరోవైవు దుర్భిక్షంతో తడారిన రాయలసీమ గొంతుక తడపడానికే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని కృష్ణా బోర్డుకు మరోసారి స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ రాష్ట్రానికి కేటాయించిన వాటా ప్రకారం నీటిని వాడుకోవడానికే ఎత్తిపోతల చేపట్టామని వివరించేందుకు సిద్ధమైంది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ సర్కార్‌ చేపట్టిన ప్రాజెక్టులను నిలుపుదల చేశాకే రాయలసీమ ఎత్తిపోతలపై చర్చించాలని స్పష్టం చేయనుంది. కృష్ణా నదిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు ఇటీవల పరస్పరం బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పందిస్తూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డుకు నిర్దేశం చేశారు. తక్షణమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులతోపాటు సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను బోర్డు ఆదేశించింది. అదే తరహాలో రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇరు రాష్ట్రాలకు చైర్మన్‌ ఎ.పరమేశం లేఖ రాశారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లతోపాటు నీటి పంపిణీ, విద్యుత్‌ పంపిణీ, టెలీమెట్రీ రెండో దశ అమలు, బడ్జెట్‌ –సిబ్బంది కేటాయింపు అంశాలను అజెండాలో చేర్చారు. కృష్ణా బోర్డు సూచనల మేరకు సమావేశంలో చర్చించే అంశాల అజెండాను ఏపీ జలవనరుల శాఖ ఖరారు చేసింది. ఆ అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ.. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌(పీహెచ్‌పీ) ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు నీటిని తరలించవచ్చు. కానీ ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో 10 – 15 రోజులు కూడా ఉండదు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటే పీహెచ్‌పీ ద్వారా కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా చేరదు. కేటాయింపులున్నా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉండదు. తెలంగాణ కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్‌ భగరీథ, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీల డీపీఆర్‌లను పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ ఇస్తాం.
కృష్ణా నదికి వరద వచ్చే సమయంలో ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేసే సమయంలో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోకూడదు. సాంకేతిక కమిటీ నివేదికను తక్షణమే తెప్పించి మిగులు జలాల్లో వాటాలను తేల్చాలి. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువలో 39.41 – 43.67 శాతం వరకు సరఫరా నష్టాలను తెలంగాణ సర్కార్‌ చూపిస్తోంది. దీంతో ఏపీ వాటా కింద రావాల్సిన జలాలు రావడం లేదు. సరఫరా నష్టాలను తేల్చడానికి రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేయాలి. కృష్ణా బోర్డు ఏర్పాటై 6 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బోర్డు పరిధిని తేల్చలేదు. వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఆమోదించలేదు. తక్షణమే పరిధిని ఖరారు చేసి వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఆమోదించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలి. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పనిచేయాలి. బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించాలి.

Related Posts