సంక్షేమే తారక మంత్రమా
విజయవాడ, జూన్ 4,
సంక్షేమ పధకాలు ఇవాళా నిన్నా కాదు, స్వర్గీయ ఎన్టీఆర్ వాటిని వెల్లువలా జనంలోకి తెచ్చారు. కొత్త ఒరవడి సృష్టించారు. ఇక ఆ తరువాత వైఎస్సార్ వాటిని మొత్తం జనాభాకు అందేలా చర్యలు తీసుకున్నారు. జగన్ దాకా వచ్చేసరికి వారూ వీరు అన్నది చూడకుండా అందరికీ పందేరాలు ఇస్తున్నారు. గత ఏడాదిగా లెక్కలు తీస్తే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పధకాలకే ప్రభుత్వం ఖర్చు చేసింది. మూడున్నర కోట్ల మందికి నేరుగా వీటిని అందచేసింది. నగదు బదిలీ పధకాన్ని జగన్ విజయవంతంగా అమలు చేస్తున్నారు.ఇక ఏపీలో కరోనా మహమ్మారి వీర విహారం చేస్తున్నా లాక్ డౌన్ ఉన్నా కూడా కరెన్సీని కదిలించి పేదలకు కాస్తా ఊరటను ఇచ్చిన ఘనత జగన్ దేనని చెప్పాలి. ఇలా తొలి ఏడాది అంతా సంక్షేమానికే ఖర్చు చేసి తన చేతికి ఎముక లేదు అన్నట్లుగా జగన్ రుజువు చేసుకున్నారు. ప్రజలు పన్నుల ద్వారా కట్టిన సొమ్ముని నేరుగా పేదలకు, లబ్దిదారులకు మళ్ళించడం ద్వారా జగన్ అతి పెద్ద సాహసమే చేసారు. ఫలితంగా ఖజానా ఎపుడూ వెక్కిరిస్తూనే ఉంది. అభివృధ్ధి పనులకు పైసా కూడా లేని చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అయినా జగన్ అజెండా మాత్రం సంక్షేమమే. ఫలాలు అందుకున్న ప్రజలే తన గట్టి మద్దతుదారులు అని భావిస్తున్నారుమంత్రాలకు చింతకాయలు రాలవు అని సామెత ఉంది. అలాగే రాజకీయాల్లో జనం మనసు గెలవడానికి సులువైన మార్గాలు ఏవీ కూడా లేవు. వారికి ఎంత చేసినా ఓడిస్తారు. కొత్త మోజులో మరొకరిని గెలిపిస్తారు. నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు కూడా జగన్ అంత కాకపోయినా బాగానే పేదలకు అన్నీ అందించారు. ఆయన కులాల వారీగా కార్పోరేషన్లు పెట్టి మరీ వారికి నేరుగా నగదు అందించారు. ఇక ఎన్నికల చివరి ఏడాది బాబు దండీగానే సంక్షేమానికి ఖర్చు చేసారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ పది వేల కోట్ల రూపాయలు పందేరంగా మహిళలకు ఇచ్చారు, ఇన్ని చేసినా కూడా బాబు దారుణంగా ఓడిపోయారు. మరి ఓట్లు రాల్చేది సంక్షేమమేనా అన్న ప్రశ్న రాకమానదు.జగన్ తొలి ఏడాది వరకూ తాను చెప్పిన హామీలను అమలు చేసేందుకు దృష్టి సారించినా మిగిలిన నాలుగేళ్ల కాలం మాత్రం అభివృధ్ధికి కేటాయించాలని అంతా కోరుతున్నారు. ఎందుకంటే సంక్షేమనేది ఎపుడూ చేయి చాచి అందుకునేదే. అది ఎపుడూ ఎవరు ఇస్తారా అంది ఎదురుచూసేది. అదే అభివృధ్ధి చేస్తే ఉపాధి అవకాశాలు పెరిగి ఎవరి సాయం లేకుండానే ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడతారు. దేశంలోనూ ఏపీ నంబర్ వన్ గా ఉంటుంది. శాశ్వతమైన ప్రగతి సాధ్యపడుతుంది. అదే ఓట్లు కూడా తెచ్చిపెడుతుంది. అందువల్ల అనార్తులను, తక్షణ సాయం కావాల్సిన వారిని ఆదుకోవాల్సిందే. అదే సమయంలో అభివృధ్ధి వైపు కూడా జగన్ చూపు పెడితేనే ఆయన 2024 ఎన్నికలను ధీమాగా ఎదుర్కోగలరని అంటున్నారు. ఇదే విషయం మీద మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు మాట్లాడుతూ జగన్ ఒక్క సంక్షేమాన్నే నమ్ముకుంటున్నారని, దాని వల్ల ఓట్లు పడడం కష్టమేనని అపుడే అపశకునం పలుకుతున్నారు. ఎవరేం చెప్పినా జగన్ మాత్రం అభివృధ్ధిని మరువరాదు అన్నది మేధావుల మాటగా ఉంది.