YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 62 రోజుల తర్వాత చేపల వేట

 62 రోజుల తర్వాత చేపల వేట

 62 రోజుల తర్వాత చేపల వేట
విశాఖపట్టణం, జూన్ 4,
ఆశల వేటకు అంతా సిద్ధమైంది. సుమారు 61 రోజుల తర్వాత సముద్రాన్ని మదించేందుకు గంగపుత్రులు సిద్ధమవుతున్నారు. బోట్లను తీర్చిదిద్దుతూ, వలలను అల్లుకుంటూ, ఇంధనాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. వేట నిషేధ కాలంలో ఎన్నో ఇబ్బందులు  ఎదుర్కొన్న మత్స్యకారులు ఇక ఆ కష్టాలను మరిచిపోయి తమ బతుకు వేటవైపు సాగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నెల 1న వేటకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని పరిస్థితులతో వేటకు బయలుదేరారు. తూర్పు తీరంలో ఏప్రిల్‌ 1 నుంచి నిలిచిపోయిన చేపల వేట తిరిగి ఈ నెల 2న మొదలైంది. చేపల వేట నిషేధం నేపథ్యంలో జిల్లాలో సుమారు ఆరు వేల బోట్లు తీరంలో నిలిచిపోయాయి. వేటకు బయలుదేరే సమయం ఆసన్నం కావడంతో ఫిషింగ్‌ హార్బర్‌లోని బోట్ల యజమానులు తమ బోట్లకు దాదాపు మరమ్మతులు పూర్తి చేసుకుని, ఇంధనం, ఇతర సామగ్రి సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. చేపల రేవు కేంద్రంగా నిత్యం 678 పడవలు, 2,996 మరపడవలు, సంప్రదాయ పడవలు 742, (జిల్లా వ్యాప్తంగా మొత్తం మరపడవలు 4,416) 1100 తెప్పలు నిత్యం చేపలు, రొయ్యల వేట సాగిస్తుంటాయి. తొలి రోజు 150 వరకూ బోట్లు వేటకు వెళ్లే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. బోట్లలో పనిచేసే కుర్రాళ్లు సైతం ఎప్పుడెప్పుడు వేటకు వెళ్తామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చేపల వేట విరామ సమయంలో కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకార కార్మికులు తిరిగి నగరానికి చేరుకున్నారు. వేట కొనసాగుతుందన్న ఉత్సాహం వారి కళ్లలో కనిపిస్తుంది.  ఒక బోటు వేటకు వెళ్లేందుకు చేసే ఖర్చు... 20 రోజులపాటు వేట సాగించే బోటుకు 4 వేల లీటర్లు ఇంధనం అవసరమవుతుంది.   వలలు సుమారు రూ.30 వేలు. బీమా చెల్లింపులు సుమారు రూ.60వేలు. ఆహార సామగ్రి రూ.10 నుంచి రూ.15వేలు. సుమారు 15 టన్నుల ఐస్‌ రూ.22 వేలు. ఇతర సామగ్రి ఖర్చులు సుమారు 30 వేలు. మొత్తంగా యజమానులు ఒక్కో బోటుపై సుమారు రూ.4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెల్లవారుజామున వేటకు వెళ్లి అదేరోజు సాయంత్రం జెట్టీకి చేరేందుకు అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ బోట్లు జెట్టీలకు చేరుకున్నా చేపలు అమ్మే విషయంలో విధివిధానాలు విధించడంతో లాంగ్‌ రన్‌ వేట కన్నా రోజువారీ వేటకే బోటు యజమానులు సిద్ధపడుతున్నారు.  ఫిషింగ్‌ హార్బర్లో ఉన్న 11 ఐస్‌ ఫ్యాక్టరీల్లో నాలుగు మాత్రమే తెరుచుకున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారంతా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. కొన్ని రోజులపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఐస్‌ వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఐస్‌ ధర టన్ను రూ.1400లు వరకూ ఉన్నా అన్ని బోట్లు ఒకేసారి వెళ్లకపోవడం, లాంగ్‌రన్‌కు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఐస్‌కు డిమాండ్‌ లేదేని యజమానులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పక పాటించాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కె.ఫణిప్రకాష్‌ పేర్కొన్నారు. మరబోట్ల సంఘాల అధ్యక్షులు, బోటు యజమానులు, ఎగుమతిదారులు, చేపల వర్తక సంఘాల ప్రతినిధులతో ఫిషింగ్‌ హార్బర్‌లోని మత్స్యశాఖ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడీ మాట్లాడుతూ బోట్లమీద పనిచేసే కలాసీలు, జెట్టీల మీద ఉండేవారు, చేపల వ్యాపారులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హార్బర్‌ జెట్టీల మీద ఐదుగురికి మించి ఉండరాదన్నారు.

Related Posts