గుజరాత్ లో కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన రాజ్యసభ ఎన్నికలు
అహ్మాదాబాద్ జూన్ 4,
ఇప్పటికే కొన ఊపిరి మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరిగే రాజ్యసభ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ పావులు కదుపుతుండడంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్ లో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పటేల్ - కప్రాద ఎమ్మెల్యే జితూ చౌదరి తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి అప్పగించారు. అయితే ఆ రాజీనామాలను స్పీకర్ వెంటనే ఆమోదించడం గమనార్హం. అయితే కాంగ్రెస్ పార్టీకి గత మార్చి నెలలోనే ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారని తెలుస్తోంది.గుజరాత్ అసెంబ్లీ లో మొత్తం సభ్యులు 182 మంది. వీరిలో బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 66 మంది ఉన్నారు. అయితే ఈ నెల 19వ తేదీన రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ముగ్గురు అభయ్ భరద్వాజ్ - రమిలా బరా - నరహరి అమిన్ - కాంగ్రెస్ నుంచి ఇద్దరు శక్తికాంత్ గోహిల్ - భరత్ సింగ్ సోలంకి నిల్చున్నారు. గుజరాత్ నుంచి నలుగురు మాత్రమే రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఆ వీలైనన్ని ఎక్కువ స్థానాలు పొందాలనే ఉద్దేశంతో బీజేపీ రాజకీయాలకు తెర లేపింది. దీంతో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఒకటే రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది