ఆ 34 గ్రామాల్లో కనిపించని వెలుగు
అదిలాబాద్, జూన్ 5,
తెలంగాణలో వందకుపైగా గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉంటున్నాయి. విద్యుత్ సరఫరా లేక అభివృద్ధి ఆమడదూరంలోనే ఉండిపోయాయి. ప్రత్యేక అభివృద్ధి నిధిలో భాగంగా గిరిజన తండాలకు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా.. అధికారుల ఉదాసీనతతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు విద్యుత్ లేని గ్రామాల్లో ఎక్కువ భాగం అటవీ భూములు ఉండటంతో అక్కడ కరెంటు లైన్ల ఏర్పాటుకు అటవీ శాఖ మోకాలడ్డుతోంది.గిరిజన సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రా ష్ట్రంలో కరెంటు లేని గ్రామాలు 34 మాత్రమే ఉన్నాయి. సగటున యాభై కుటుంబాలున్న ప్రాంతాన్ని గ్రామంగా పరిగణిస్తూ గణాంకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. గణాం కాలను సమర్పించిన గిరిజన సలహా మండలి.. అక్కడ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ఆమోదించినప్పటికీ.. పనులు మొదలుకాలేదు. రిజర్వుడ్ అటవీ ప్రాంతం నుంచి లైన్లు వేస్తే అటవీ సంపదకు విఘాతం కలుగుతుందని పేర్కొంటోంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గిరిజన తాండాలకు విద్యుత్ వెలుగులు అందడం లేదు. కరెంటు లేని గ్రామాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తాగునీటికి చేతిపంపులే దిక్కు. కొన్నిచోట్ల గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సోలార్ లైట్లు ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. కానీ వీటిని పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. కొందరి వద్ద సెల్ఫోన్లు ఉన్నా.. వాటి చార్జింగ్ కోసం మండల కేంద్రం, లేదంటే సమీపంలో కరెంటు ఉన్న గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. బ్యాటరీ నిండుకుంటే మళ్లీ పక్క గ్రామాలకు పరిగెత్తాల్సిందే. అప్పటివరకు సెల్ఫోన్లు మూగబోయి ఉండాల్సిందే. ఊర్లో దాదాపు వంద మంది ఉంటాం. అన్ని గుడిసెల్లోనూ రాత్రిపూట నూనె దీపాలే. కరెంటు సరఫరా కోసం అధికారులను, నాయకులను అడిగి అలిసిపోయాం. కరెంటు లైన్లు వేస్తామంటూ శంకుస్థాపన చేసినా పనులు సాగలేదు. వ్యవసాయ పనుల కోసం పడే కష్టాలు అంతాఇంతా కావు. చేసేది లేక పొరుగు గ్రామాలకు వలసలు పోతున్నామని అన్నారు.