YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

నాన్న ప్రపంచాన్ని మార్చేశాడు : గియానా  ఫ్లాయిడ్

నాన్న ప్రపంచాన్ని మార్చేశాడు : గియానా  ఫ్లాయిడ్

నాన్న ప్రపంచాన్ని మార్చేశాడు : గియానా  ఫ్లాయిడ్
వాషింగ్టన్, జూన్ 5, 
నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు.. పోలీసుల దమనకాండలో తన తండ్రిని పోగొట్టుకున్న ఒక చిన్నారి చెప్పిన ఈ మాట ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను శోక సముద్రంలోకి నెట్టేసింది. అమెరికాలో నల్లజాతి వ్యక్తి మెడపై కాలుపెట్టి నొక్కి చంపేసిన ఘాతుక చర్యకు నిరసనగా గత అయిదురోజులుగా అమెరికా అట్టుడికిపోతోంది. గత 60 సంవత్సరాల అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని నిరసనల హోరుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. వైట్ హౌస్ మీదే దండయాత్రకు ఆ వ్యాఖ్యలు పురిగొల్పాయి. ఇంతటి విషాదకరమైన, హింసాత్మకమైన వాతావరణంలో కన్నతండ్రిని పోగొట్టుకున్న ఆ చిన్నారి చెప్పిన మాటలు యావత్ ప్రపంచానికి నైతిక పాఠంగా మారాయి.  మిన్నోపోలిస్‌ పట్టణంలో పత్రికా సదస్సు ముగిసిన అనంతరం జార్జి కుమార్తె గియానా ఫ్లాయిడ్‌ తన తండ్రి స్నేహితుడి భుజాలపై కూర్చుని చెప్పిన మాటలు ప్రపంచాన్ని కదిలించివేస్తున్నాయి. నాన్న ఏం చేశాడు అని వెనకనుంచి ఎవరో అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగా ఆ చిన్నారి నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు అంటూ చెప్పిన మాటలు హృదయమున్న ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ చిన్నారిని తన భుజాలమీదికి ఎత్తుకుని కనిపించిన జార్జి స్నేహితుడు స్టీఫెన్ జాక్సన్ ఆ వీడియో క్లిప్‌న పోస్టు చేస్తూ దట్స్ రైట్ గిగి (గియానా ఫ్లాయిడ్) నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు. జార్జి ఫ్లాయిడ్.. ది నేమ్ ఆఫ్ ఛేంజ్.. అందరినీ ప్రేమించే ప్రతి ఒక్కరికీ ప్రేమ సందేశం అంటూ చేసిన వ్యాఖ్యలు వేలాదిమంది నెటిజన్ల హృదయాలను పిండేశాయి. తండ్రిని కోల్పోయినప్పటికీ ఆ చిన్నారి తన స్ఫూర్తిని సమున్నతంగా ఈ ప్రపంచం ముందు నిలిపిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ చిన్నారి తండ్రి జ్ఞాపకార్థం ఒక కన్నీటి బొట్టును విడవండి అంటూ సందేశాలు పంపుతున్నారు. 46 సంవత్సరాల జార్జి ఫ్రాయిడ్‌ని ఒక తెల్లజాతి దురహంకార పోలీసు అధికారి మిన్నేపోలిస్ పట్టణంలో మెడపై కాలువేసి తొక్కి చంపేసిన ఘాతుక చర్య ప్రపంచం మొత్తానికి షాక్ కలిగించింది. తనకు ఊపిరి ఆడటం లేదని జార్జి మొత్తుకుంటున్నా ఆ పోలీస్ అధికారి ఏడు నిమిషాల పాటు జార్జి గొంతును మోకాలితో నొక్కి మరీ చంపేయడం అమెరికాలో కనీవినీ ఎరుగని విధ్వంసానికి కారణమైంది. డెరెక్ చౌవిన్ అనే ఆ శ్వేత దురహంకార అధికారి చేసిన పని థర్డ్ డిగ్రీ మర్డర్ అని ఆరోపిస్తూ కేసుపెట్టి జైలుకు పంపారు. అమెరికాలోనూ, ప్రపంచనగరాల్లోనూ జస్టిస్ ఫర్ జార్జి ఫ్లాయిడ్ అనే డిమాండుతో ఉద్యమం నడుస్తోంది.
జార్జి నివాళి ర్యాలీలో 60 వేలమంది హాజరు
జార్జ్‌ ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా హ్యూస్టన్‌లో జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకానికి బలైన ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఫ్లాయిడ్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర మేయర్‌ సిల్వస్టర్‌ టర్నర్, ఎంపీ షీలా జాక్సన్, లిజ్జీ ఫ్లెచర్, సిల్వియా గార్సియా అల్‌ గ్రీన్‌లతోపాటు కొంతమంది ర్యాప్‌ గాయకులు  ర్యాలీలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. ‘హ్యాండ్స్‌ అప్‌.. డోంట్‌ షూట్‌’, ‘నో జస్టిస్, నో పీస్‌’అని నినదిస్తూ ర్యాలీ హ్యూస్టన్‌ నగరం గుండా సాగింది. డిస్కవరీ గ్రీన్‌ పార్క్‌ నుంచి సిటీహాల్‌ వరకూ ఉన్న మైలు దూరం ఈ ర్యాలీ నడిచింది.  ర్యాలీ ప్రారంభానికి ముందు అందరూ మోకాళ్లపై నిలబడి కాసేపు ప్రార్థనలు చేయగా హ్యూస్టన్‌ పోలీస్‌ అధికారులు  ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. పోలీస్‌ అధికారి ఆర్ట్‌ ఎసివిడో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ భార్య రాక్సీ వాషింగ్టన్‌ మాట్లాడుతూ ఆరేళ్ల తన కుమార్తె గియానా మంచి తండ్రిని కోల్పోయిందన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలని వాపోయింది. వారం రోజులపాటు అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన అమెరికన్‌ నగర వీధుల్లో ఎట్టకేలకు కొంత ప్రశాంతత నెలకొంది. మంగళవారం ప్రదర్శనలు జరిగినా చాలావరకూ అవి శాంతియుతంగా సాగాయి. ఆందోళనలకు సంబంధించి బుధవారంనాటికి మొత్తం 9,000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు.   
ఫ్లాయిడ్‌ మృతిపై పౌరహక్కుల విచారణ 
జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్‌ పలీస్‌ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్‌ రెబెకా లూసిరో, గవర్నర్‌ టిమ్‌ వాల్ట్‌జ్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విచారణ ద్వారా పోలీసుల వివక్షాపూరిత చర్యలను గుర్తించి తాత్కాలికంగానైనా పరిష్కార చర్యలను అమల్లోకి తేవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందించాలన్న అమెరికా సిద్ధాంతం ఎక్కడ? ఎందుకు విఫలమైందో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని, జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణోదంతం ఇందుకు కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్‌ భార్య)తోపాటు నేను ఫ్లాయిడ్‌ ఉదంతంపై ఎంతో బాధపడ్డాం. అన్యాయమైన వ్యవహారాలు దేశం ఊపిరి తీసేస్తున్నాయి. అయినాసరే.. ఇప్పటివరకూ మాట్లాడకూడదనే నిర్ణయించాం. ఎందుకంటే ఇది లెక్చర్‌ ఇచ్చే సమయం కాదు. వినాల్సిన సమయం’అని బుష్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు.   శాంతియుతంగా ఉండాలి: మెలానియా ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా  స్పందించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలవారు, పౌరులందరూ సురక్షితంగా ఉండాలంటే శాంతి ఒక్కటే మార్గమని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని మెలానియా ట్వీట్‌ చేశారు. ఒక రోజు ముందు మెలానియా ఇంకో ట్వీట్‌ చేస్తూ.. ఫ్లాయిడ్‌ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్‌ మతం ముసుగులో తనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి.  సాధారణ పరిస్థితుల్లో ట్రంప్‌ మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి ఏమీ కాదని, ప్రస్తుతం పదేపదే చర్చిలకు వెళ్లడం, బైబిల్‌ పట్టుకుని పోజులు ఇవ్వడం మత విశ్వాసాలు ఉన్న వారిని తమవైపు ఆకర్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా మీడియా విమర్శిస్తోంది. మినియాపొలిస్‌ నగరంలో మే 25న పోలీస్‌ కస్టడీలో ఫ్లాయిడ్‌ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే. కాగా, నిరసనకారులు వెనక్కితగ్గకుంటే శాంతిభద్రతలు కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన కలకలం రేపింది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతంపై ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు.

Related Posts