వచ్చే ఐదేళ్లలో 200 అర్భన్ ఫారెస్ట్లను అభివృద్ధి: ప్రకాశ్ జవదేకర్
న్యూ ఢిల్లీ జూన్ 5
దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 200 అర్భన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏడాది జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 సంక్షోభం కారణంగా వర్చువల్గా వేడుకలను జరిపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రం నేడు 'నగర్ వన్' పథకాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 200 అర్భన్ ఫారెస్టులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ విభాగం, ఎన్జీవోలు, కార్పొరేట్స్, స్థానిక పౌరులు, ప్రజల సహకారం, భాగస్వామ్యంతో ఈ నగర వనాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. యూనైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ఈ ఏడాది పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. బయోడైవర్సిటీ ఈ ఏడాది థీమ్ కాగా.. కేంద్రం థీమ్ నగర్ వన్(అర్భన్ ఫారెస్ట్స్). ఈ పార్కులు నగరాల ఊపిరితిత్తులుగా పనిచేస్తాయని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అటవీశాఖకు చెందిన భూముల్లోనే మొదటగా మొక్కల పెంపకం చేపడతామన్నారు. అనంతరం స్థానిక సంస్థలు అందించే భూముల్లో వనలా అభివృద్ధిని చేపడతామన్నారు. ప్రత్యేక ఏకాగ్రతతో జీవ వైవిద్యానికి ప్రకృతి కోసం సమయం కేటాయించాలన్నారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నారు. ప్రపంచ జీవవైవిద్యంలో భారతదేశం 8 శాతాన్ని కలిగిఉందని మంత్రి తెలిపారు. ప్రపంచ భూభాగంలో 2.5 శాతం, జనాభాలో 16 శాతం, పశు సంతతి, 4 శాతం మాత్రమే మంచినీటి వనరులను కలిగి ఉండటం వంటి అనేక అవరోదాలు ఉన్నప్పటికీ జీవవైవిద్యంలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. జీవవైవిధ్యం భారతీయ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు.