రావాల్సిన వాటా ప్రకారమే ఎత్తిపోతల నిర్మాణం: రజత్ కుమార్
హైదరాబాద్ జూన్ 5
గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఇరు రాష్ర్టాల తరఫున అధికారులు, ఇంజినీర్లు తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తరపున బోర్డులో వాదనలు వినిపించిన రాష్ట్ర నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ వివరాలను వెల్లడించారు. గోదావరి బేసిన్లో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదని వెల్లడించామని, కాళేశ్వరం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించకూడదని కోరామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారమే ఎత్తిపోతల నిర్మాణం చేపట్టామని చెప్పారు. పోలవరం, పట్టిసీమపై బోర్డు దృష్టికి తీసుకువచ్చామని అన్నారు. పోలవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని వెల్లడించారు. టెలిమెట్రీల విషయం ఎక్కడా దాటిపెట్టడం లేదని తెలిపారు. సాంకేతిక సమస్యలపై కృష్ణా, గోదావరి బోర్డులకు స్పష్టంగా చెప్పామన్నారు. గోదావరి బేసిన్లో తమకు 967 టీఎంసీల వాటా ఉందని చెప్పారు. గోదావరి బేసిన్లో టెలిమెట్రీ ఏర్పాటుపై కమిటీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. 2014 జూన్ 2 వరకు పూర్తయిన ప్రాజెక్టుల గురించి అడగవద్దని కోరామన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, లోయర్ పెన్గంగ ప్రాజెక్టులతోపాటు రామప్ప నుంచి పాకాల వరకు నీటి తరలింపు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గురువారం కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే.