నిధులు లేవు
న్యూఢిల్లీ జూన్ 5
కరోనా ఎఫెక్ట్తో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో ప్రకటించిన కొత్త పథకాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 మార్చి 31 వరకు కొత్త పథకాలకు నిధుల కేటాయింపు చేయలేమని తెలిపింది. కరోనా మహమ్మారితో పోరాటం వేళ కేంద్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో ప్రకటించిన కొత్త పథకాలన్నింటినీ పెండింగ్లో పెట్టింది. వాటికి నిధులు కేటాయించే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. బడ్జెట్లో ప్రకటించిన కొత్త పథకాలు మార్చి 31 వరకూ నిలిచిపోతాయని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం (జూన్ 5) ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చును తగ్గించే క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర అభియాన్ భారత్తో పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాలకు మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. వీటి అమలుకు నిధుల కేటాయింపు ఉంటుందని వివరించింది. ఇతర పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని స్పష్టం చేసింది. తాజా చర్యల ద్వారా సమకూరే నిధుల మొత్తాన్ని కరోనా మహమ్మారితో పోరు కోసం వినియోగిస్తామని వివరించింది. ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలు ఉండవని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నూతన పథకాల కోసం ఆర్థిక శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కొవిడ్-19 వ్యాప్తితో ప్రభుత్వ ఆర్థిక వనరులకు అసాధారణ డిమాండ్ నెలకొన్న వేళ.. మారుతున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా వాటిని సవ్యంగా వినియోగించుకోవాల్సి అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోట్లో పేర్కొన్నారు. ఈ నూతన నిబంధనలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలన్నా.. దానికి వ్యయ విభాగం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు