జెట్ స్పీడ్ లో కరోనా వైరస్
న్యూఢిల్లీ, జూన్ 6,
కరోనా వైరస్ జెట్ స్పీడ్ లో దేశంలో విస్తరిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 35 వేల 301కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 1,12,938 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 6633 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,15,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 10,927 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 343 మంది ఈ వైరస్ సోకడంతో మృత్యవాత పడ్డారు.నాలుగువిడతలుగా లాక్ డౌన్ విధించినా, ఐదవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్నా రోజుకి సరాసరిన 9000 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్–19 కేసుల్లో ప్రపంచ దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది.అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ తర్వాత స్థానం భారత్దే. జూన్ 8 నుంచి ప్రార్థనామందిరాలు, మాల్స్ వంటి వాటిని ప్రారంభిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. కేసులు ఇదే స్థాయిలో పెరిగితే త్వరలోనే ఇటలీని దాటిపోనుంది. ఇక కోవిడ్ రోగుల రికవరీ రేటు 48.27 శాతంగా ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులకు తోడు మరణాల రేటు వారం వారం పెరుగుతూనే వుంది. మార్చి 12వ తేదీన కరోనా కారణంగా ఒకరు మరణిస్తే.. ఏప్రిల్ 29 నాటికి కరోనా మరణాలు 1008కి పెరిగాయి. ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకూ అంటే కేవలం 11 రోజుల వ్యవధిలోనే 2109 అంటే రెండింతలు అయ్యాయి. మే 18 నాటికి అంటే 8 రోజుల్లోనే 3029కి అంటే వెయ్యి మరణాలు నమోదయ్యాయి. మే 25 నాటికి కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 4021 కి చేరింది. మే 31 నాటికి మరణాల సంఖ్య 5164 కి చేరిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. జూన్ 4 వతేదీకి 6075గా నమోదైంది. మొదట్లో మృతుల సంఖ్య వెయ్యికి చేరుకోవడానికి 47 రోజులు పట్టింది. కానీ ఇప్పుడు నాలుగు రోజుల్లోనే 900 పైగా మరణాల సంఖ్య నమోదవుతోంది. మరోవైపు చైనాలో అత్యవసర పరిస్థితి తీవ్రతతో కరోనా తగ్గింది. కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వూహాన్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు లేవని తెలిపింది. వూహాన్లోని మొత్తం కోటి మందికీ కోవిడ్–19 పరీక్షలు జరపగా ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ప్రపంచంలోని 215 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 67 లక్షల 53 వేల 964 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 30 లక్షల 80 వేల 491. కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 94 వేల 736 మంది చనిపోయారు. వ్యాధి నుంచి 32 లక్షల 78 వేల 737 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా కేసులు, మరణాల గణాంకాలు భయం కలిగిస్తున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులతో అప్రమత్తం కావాలని వైద్యుల సూచిస్తున్నారు.