చేపలు పట్టుకుని జీవనం సాగించేవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు కార్మికులకు ఉపాధికి ఊతమివ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సమీకృత మత్స్య అభివృద్థి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కోసం నిర్మల్ జిల్లాకు రూ.32.29 కోట్లు మంజూరయ్యాయి. మత్స్యకారులకు వాహనాలు, వలలు, ఇతరత్రా వాటిపై రాయితీలు, సహకార సంఘాలకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. కొత్తగా తవ్విన చెరువులు, పునరుద్ధరించిన చెరువుల్లో అధికారులు చేప పిల్లలను వదులుతున్నారు. వీటిని మత్స్యకారులు పట్టుకుని సొమ్ముచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. చేపల పెంపకానికి మత్స్యకారులు పెద్దగా ఖర్చు చేయాల్సిన పనే లేదు. పైగా చేపలు పట్టుకునేందుకు, రవాణాకు సంబంధించిన పనిముట్లు, యంత్రాలు సమకూర్చుకునేందుకు రాయితీలు కూడా అందిస్తోంది. దీంతో జిల్లా మత్సకారులు, కార్మికులకు ఉపాధి లభించడంతో పాటూ ఆర్ధిక ఆదరువూ లభించినట్లైంది.