తెలంగాణలో మరోసారి రాజకీయ రగడ
హైద్రాబాద్, జూన్ 8
జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌజ్పై తెలంగాణలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. ఈ వ్యవహరంపై పట్టువదలకుండా పోరాడుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రయత్నం కొంతవరకు ఫలించింది.ఆయన ఫిర్యాదుపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది. జీవో నెం 111 ఉల్లంఘించి నిర్మించినట్లుగా ఉన్న ఆరోపణలు అక్రమమా, సక్రమమా అని తేల్చేందుకు ఎన్జీటీ ఓ కమిటీ వేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఎన్జీటీ నియమించింది. మంత్రి కేటీఆర్కు కూడా నోటీసులు జారీ చేసింది.దీంతో ఫామ్ హౌజ్ వ్యవహారంలో మరోసారి కేటీఆర్ ఇరుకునపడ్డారు. ఎన్జీటీ విచారణపై ఎటువంటి ప్రభావం లేకుండా విచారణ పారదర్శకంగా జరగాలంటే మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ వినిపిస్తోంది. ఎన్జీటీ వేసిన కమిటీలో కేటీఆర్ మంత్రిగా ఉన్న మున్సిపల్ శాఖ అధికారులు ఉన్నందున కేటీఆర్ రాజీనామా చేస్తేనే విచారణ పారదర్శకంగా ఉంటుందని కాంగ్రెస్ అంటోంది.కేసీఆర్ అయినా కల్పించుకొని కేటీఆర్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి, ఇవి రెండూ జరిగే పనులు కాదని వారికి కూడా తెలుసు కానీ కేటీఆర్ను టార్గెట్ చేసేందుకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన అస్త్రంగా ఈ విచారణ మారింది.నిజానికి, కాంగ్రెస్ పార్టీపరంగా కన్నా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఆ సమయంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తప్ప ఆయన వెంట చెప్పుకోదగిన స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఎవరూ లేరు. జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, వి.హనుమంతరావు వంటి కాంగ్రెస్ నేతలే ఈ విషయంలో రేవంత్ తీరును తప్పుపట్టారు.అంతకుముందు రేవంత్ రెడ్డిపై వచ్చిన గోపన్పల్లి భూఆక్రమణల ఆరోపణల నుంచి దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి పర్సనల్ ఇంట్రెస్ట్తో కేటీఆర్ ఫామ్ హౌజ్ వ్యవహారాన్ని బయటకు తీశారని ఆరోపించారు. చాలామంది కాంగ్రెస్ నేతలకు కూడా అక్కడ ఫామ్ హౌజ్లు ఉన్నాయని కూడా కొందరు కాంగ్రెస్ నేతలు ఒప్పుకున్నారు.కానీ, ఇప్పుడు కేటీఆర్కు ఎన్జీటీ నోటీసులు ఇవ్వడం, విచారణకు కమిటీ వేయడంతో కాంగ్రెస్ నేతలంతా ఈ వ్యవహారాన్ని టేకప్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈసారి రేవంత్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్పై ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ను మరింత ఇరుకున పెట్టే మరో అస్త్రాన్ని సిద్ధం చేశారట రేవంత్ రెడ్డి.ఈ విషయాన్ని రేవంత్ స్వయంగా ప్రకటించారు. ముందుంది మోసళ్ల పండుగ అంటూ నేరుగా ఆయన కేటీఆర్కే ట్వీట్ చేశారు. దీంతో రేవంత్ మరో సంచలనం ఏం బయటపెట్టబోతున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.కానీ, రేవంత్కు టీఆర్ఎస్ కూడా గట్టి కౌంటర్ ఇస్తోంది. రేవంత్రెడ్డి వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారని, గోపన్పల్లిలో దళితుల భూములు ఆక్రమించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిపైకి టీఆర్ఎస్ పార్టీ తరచూ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ప్రయోగిస్తుంది. ఆయనే ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగి రేవంత్పై విమర్శలు గుప్పించారు.రేవంత్ రెడ్డి అక్రమాలన్నీ బయటపెడతామని టీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుతున్నారు. మొత్తంగా మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వ్యవహారం సీరియస్ అయ్యింది. అయితే, కేటీఆర్ మాత్రం ఎన్జీటీ నోటీసుల వ్యవహారాన్ని తేలికగా కొట్టేస్తున్నారు. ఈ ఫామ్ హౌజ్ తనది కాదని, తనపై ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకుంటానని స్పష్టం చేస్తున్నారు.