YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కలెక్టర్ సంతకంతో భూములు అమ్మేసిన అటెండర్

కలెక్టర్ సంతకంతో భూములు అమ్మేసిన అటెండర్

కలెక్టర్ సంతకంతో భూములు అమ్మేసిన అటెండర్
శ్రీకాకుళం, జూన్ 8,
అతడు చేసేది అటెండర్‌ ఉద్యోగం.. పెట్టేది మాత్రం కలెక్టర్‌ సంతకం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి దేవదాయ శాఖలో కంటింజెంట్‌ ప్రాతిపదికన అటెండర్‌గా పని చేస్తున్న బెలమర ధర్మారావు ఫోర్జరీ బాగోతం బయటపడింది. ఈ వ్యవహారాన్ని కార్యాలయం ఈఓ వీవీఎస్‌ నారాయణ పసిగట్టి ఆదివారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్కలి మండలం భగవాన్‌పురం గ్రామానికి చెందిన బెలమర ధర్మారావు టెక్కలి దేవదాయ శాఖ కార్యాలయంలో కంటింజెంట్‌ ప్రాతిపదికన రూ. 5 వేల వేతనానికి అటెండర్‌గా పని చేస్తున్నాడు. నందిగాం, మెళియాపుట్టి ప్రాంతాల్లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూముల విక్రయాలపై కన్నేసిన ధర్మారావు దీనికి పక్కాగా ప్లాన్‌ వేశాడు.కార్యాలయంలో ఉన్న పత్రాలను పోలిన కొన్ని రకాల డీ పట్టాలను సృష్టించాడు. దీనిపై కలెక్టర్‌ సంతకాలు, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పేరుతో ఉన్న సీలు, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేసి కొంత మంది వ్యక్తులకు అమ్మేశాడు. వీటితో పాటు దేవదాయ శాఖలో కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి విజయవాడలోని దేవదాయ కమిషనర్‌ పేరుతో నకిలీ పత్రాలను సృష్టించాడు. అయితే ధర్మారావు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని అమ్మకాలు చేశాడు తప్ప భూములు చేతులు మారలేదు. దీంతో గత కొంత కాలంగా ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ధర్మారావు కార్యాలయానికి తరచూ గైర్హాజరు కావడంతో ఈఓకు అనుమానం వచ్చి పలుమార్లు హెచ్చరించడమే కాకుండా నోటీసులు జారీ చేశారు.ఇదే సమయంలో కొంత మంది వ్యక్తులు ధర్మారావు కోసం తరచూ కార్యాలయానికి వస్తుండడంతో ఈఓ వీవీఎస్‌ నారాయణకు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం బయట పడింది. వెంటనే ఈఓతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ ఎన్‌.ఆదినారాయణ తదితరులు హుటాహుటిన టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ధర్మారావు 10 మందికి పట్టాలను విక్రయించి సుమారు రూ. 1.40 లక్షలు వసూలు చేసినట్లు ప్రాథమికంగా తేలింది. దేవదాయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts