ఏపీ కేబినెట్ బెర్తు కోసం పావులు
విజయవాడ, జూన్ 9
ఇంకా పదిరోజులే సమయం. మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ వైసీపీలో మరో పదిరోజుల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారనున్నాయి. ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకోనుంది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వర్ల రామయ్య కేవలం నామమాత్రమే. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఇద్దరు రాజ్యసభకు ఈ నెల 19వ తేదీన ఎన్నిక కానుండటంతో వారు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఈ నెల 19వ తేదీ రాజ్యసభ ఎన్నికలు కాబట్టి ముందుగానే మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ మానసికంగా సిద్ధమయ్యారు. రాజ్యసభకు ఎన్నికయినట్లు డిక్లరేషన్ ఫారం తీసుకునే ముందే వీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడంతో తనకు అత్యంత నమ్మకమైన ఇద్దరినీ జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. పార్టీలో ఈ పదవుల కోసం అనేక మంది వెయిట్ చేస్తున్నా జగన్ వీరికే ప్రాధాన్యత ఇచ్చారు.ఇంతవరకూ ఓకే. కానీ ఆ తర్వాతే జగన్ కు ఇబ్బంది కరంగా మారనుంది. ఈ ఇద్దరి స్థానంలో మరో ఇద్దరిని కొత్తగా మంత్రివర్గంలోకి జగన్ చేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఇద్దరు ఎవరన్న దానిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. పదిరోజులే సమయం ఉండటంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరి ప్రాంతాలు, సామాజిక వర్గాల వారికే జగన్ ప్రాధాన్యత ఇస్తారా? లేక మరో దిశగా నిర్ణయం ఉంటుందా? అన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో ఉంది.అయితే ఇప్పటికే జగన్ దీనికి సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దీంతో ఆశావహులు జగన్ ను నేరుగా కలిసేందుకు వీలు కాకపోవడతో సీనియర్ నేతలను కలసి తమ గోడును విన్నవించుకుంటున్నారు. తూర్ప గోదావరి, గుంటూరు జిల్లాలకే ప్రాధాన్యం ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేకపోవడంతో ఇతర జిల్లాలకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి