ఎమ్మెల్యేల డమ్మీలు అయిపోతున్నారా..
విజయవాడ, జూన్ 9,
నేను విన్నాను.. నేను ఉన్నాను…! అనే నినాదంతో భారీ మెజారిటీతో టీడీపీని ఢీ కొట్టి అధికారంలోకి వచ్చారు వైసీపీ అధినేత జగన్. 151 సీట్లలో విజయంతో ఆయన అధికారం చేపట్టారు. ఇది నిజంగానే జగన్ సునామీ. సందేహం లేదు. అయితే, ఈ క్రమంలో తనకు ప్రజలే ముఖ్యం అనుకోవడం కూడా సీఎంగా జగన్కు తప్పుకాదు. కానీ, నేతలను కూడా పట్టించుకోవాలి కదా? అనేది ఇప్పుడు తెరమీదికి వచ్చిన కీలక ప్రశ్న. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో తమ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలను, కార్యక్రమాలను 90 శాతం పూర్తి చేశామని.. మంత్రులు, సీఎం జగన్ చెప్పుకొంటున్నారు.కానీ, ఇదే మాటను.. సాధారణ వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారు! నియోజకవర్గాల్లో ఛాతీ విరుచుకుని నిలబడలేక పోతున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి.. మేం పనిచస్తున్నాం.. అని నొక్కి వక్కాణించలేక పోతున్నారు. దీనికి కారణం ఏంటి? పైగా.. ఇప్పుడు కరణం ధర్మశ్రీ మొదలు.. ఆనం వరకు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. ఇలా ఎందుకు జరుగుతోంది.? అసలు లోపం ఎక్కడ ఉంది.? సంక్షేమానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆన్లైన్లోనే డబ్బులు పందేరం చేస్తున్నారు. ప్రతి ఒక్క అర్హుడికీ అన్నీ చేరుతున్నాయి. కానీ, నాయకులు మాత్రం డమ్మీలుగా మారిపోతున్నారు.పార్టీలతో సంబందం లేకుండా అర్హుడైన ప్రతి ఒక్కరికి సంక్షేమ, ప్రభుత్వ పథకాలు అందాలన్న జగన్ ఉద్దేశం బాగానే ఉంది. అయితే జగన్ విధానాలు, ఆలోచనలు పేదలకు, ప్రతి ఒక్క అర్హుడికి దళారీతో సంబంధం లేకుండా పథకాలు నేరుగా అందే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలు పూర్తి డమ్మీలు అయిపోతున్నారు. దీనికి కారణం ఏంటి? అదేసమయంలో పార్టీ కేడర్ కూడా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతోంది. ఎంత జగన్ సునామీ అనుకున్నా.. ప్రజాసంకల్ప పాదయాత్రతో విజయం దక్కించుకున్నామని భావిస్తున్నా.. కండలరిగేలా.. జనాల మధ్య తిరిగింది.. జెండాలు మోసింది కార్యకర్తలు,, దిగువ శ్రేణి నాయకులు.కానీ, వారు ఏడాది పూర్తి అయినా.. ఎక్కడా సంతృప్తిగా లేరు. మరి ఈ నేపథ్యంలోనే విమర్శలు వస్తున్నాయి. సీఎంగా జగన్ ప్రజల సమస్యలు తీర్చేందుకు స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. ప్రతి సోమవారం ప్రజల నాడిని పట్టుకుంటున్నారు. మరి పార్టీని పట్టించుకుంటున్నారా? నేతలకు సమయం ఇస్తున్నారా? అనేది కీలక ప్రశ్న. గతంలోనూ చంద్రబాబు ఇలానే నేను బిజీ.. అంటూ పార్టీలో ఏం జరుగుతోందో.. క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో పట్టించుకోలేదు. దాని ఫలితం.. ఎన్నికల సమయంలో 70 ఏళ్ల వయసులో ప్రజలకు వంగి వంగి దణ్నాలు పెట్టినా.. ఫలితం కనిపించలేదు. నిజానికి బాబుతో పోల్చుకుంటే.. జగన్ ఏమంత బిజీ ఏమీ కాదు! సమయ పాలనను ఖచ్చితంగా చేస్తున్నారు.సాయంత్రం ఆరు తర్వాత ఆయన సమీక్షలు చేయడం లేదు. అధికారులతోనూ మాట్లాడడం లేదు. ఉదయం 10 వరకు కూడా అంతే. పోనీ.. ఆన్లైన్ లో ఏమైనా సమావేశాలు పెడుతున్నారా ? విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నారా ? అంటే అది కూడా లేదు. అయినా కూడా తమకు అవకాశం ఇవ్వకపోవడంపై నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిణామాలను గుర్తించి.. ముందుకు సాగాల్సిన అవసరం జగన్కు ఎంతైనా ఉంది.