సద్విమర్శలను సైతం స్వీకరిస్తా
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు జూన్ 09
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మదరాజుగూడూరు మరియు కాకుపల్లి గ్రామాలలో 3 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు, డ్రైన్లు మరియు సచివాలయాల భవనములకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్చవ కార్యక్రమాలను మంగళవారం స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యాసూచనలు, సలహాలతోపాటు సద్విమర్శలు సైతం స్వీకరిస్తానని చెప్పారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలకు సంబంధించి వీలైనంత ఎక్కువ నిధులు తీసుకువస్తానని భరోసా ఇచ్చారు.రూరల్ నియోజకవర్గంలో కరెంటు, త్రాగునీరు, రోడ్డు మరియు డ్రైన్ సమస్యలు ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేసినట్లయితే వీలైనంత త్వరగా ఆ సమస్యను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నియోజకవర్గ కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.