కేంద్రంతో సయోధ్యకు బాబు ప్రయత్నాలు
విజయవాడ, జూన్ 10,
జగన్ ఏడాది పాలన పూర్తయింది. ఇప్పుడిప్పుడే పార్టీలో అసంతృప్తులు మొదలయ్యాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు కూడా తప్పుపడుతున్నాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఇదే ఉదాహరణ అని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇది ఒక్కటే సరిపోదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. అందుకే తరచూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చంద్రబాబు ప్రశసింస్తూ వస్తున్నారు.ఏడాదిలోనే జగన్ తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ నేతలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించి కొంత ఊరట చెందుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో నేతలకు, క్యాడర్ కు భరోసా దక్కాలంటే మోదీ సహకారం అవసరం అని చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆయనకు చేరువయ్యేందుకు చంద్రబాబు దగ్గర దారులు వెతుక్కుంటున్నారు. కరోనా సమయంలో లాక్ డౌన్ అమలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలను చంద్రబాబు ప్రశసించారు. ప్రధాని కార్యాలయానికి లాక్ డౌన్ మినహాయింపుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై లేఖ కూడా రాశారు. దీంతో ప్రధాని మోదీ చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. చంద్రబాబుతో మోదీ ఫోన్ లో మాట్లాడటం క్యాడర్ లో కొంత థైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అదే భరోసాతో తాను విశాఖ వెళతానని కేంద్ర ప్రభుత్వానికి రాసుకున్న లేఖకు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవయింది.దీంతో చంద్రబాబు ఇతర మార్గాల ద్వారా మోదీకి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ కు కేంద్ర ప్రభుత్వ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం కూడా తనకు మార్గం సుగమం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ప్రశంసించేందుకు ప్రత్యేకంగా కలవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి మోదీని కలసి మాట్లాడి వస్తే మరో ఏడాది పాటు చంద్రబాబుకు, ఆయన పార్టీకి బూస్ట్ దొరికినట్లే.