కమలానికి గ్రాఫ్ పెరుగుతోందా...
గుంటూరు, జూన్ 10,
ఈ ఏడాది జనాలకు చుక్కలు చూపించింది. ఇప్పటి వరకు మొత్తం 5 నెలలు పూర్తయ్యాయి. 2020 ఎన్నో ఆశలు నెరవేరుస్తుందని, కొత్త ఆశలు చూపిస్తుందని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా ఆది నుంచి కూడా కరోనా ఎఫెక్ట్.. ద్రవ్యోల్బణం భారం.. వంటి అనేక సమస్యలను ఈ ఏడాది మోసుకొచ్చింది. అయితే, ఇంత సీరియస్ సమయంలోనూ బీజేపీ రాష్ట్ర నేతలు ఓ జోక్ పేల్చారు. బీజేపీ వడివడిగా సుడులేసుకుని మరీ.. ఏపీలో సుడిగుండంలాగా ఎదుగుతోందంట. తాజాగా ఓ మీడియాలో వచ్చిన కథనంలో కమల నాథులను ఉటంకిస్తూ.. అచ్చు ఇలానే రాశారు.విషయం ఏంటంటే.. ఈ మధ్య ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. దీనికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం చెప్పిన వాదన ఏంటంటే.. నిసర్గ్ తుఫాను కారణంగా.. దీనికి సంబంధించి న ముందస్తు చర్యల విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బిజీగా ఉన్నారని అందుకే అప్పా యింట్మెంట్ రద్దయిందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. అయితే, బీజేపీ నేతలు మరో వాదనను తెరమీదికి తెచ్చి.. తమకు మాత్రమే రహస్యంగా చెవిలో చెప్పినట్టు.. ఓ మీడియా తన పత్రికలో అచ్చేసింది.అదేంటంటే.. తామే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జగన్పై ఫిర్యాదు చేశామని… రాష్ట్రంలో జగన్ చేస్తున్న అరాచక పాలన మొత్తాన్ని ఏకరువు పెట్టామని, కోర్టులు చెబుతున్నాకూడా.. మాట వినడం లేదని చెప్పుకొచ్చామని.. నిజానికి జగన్ ప్రభుత్వంపై ఇప్పుడు మనం పైచేయి సాధిస్తున్నామని వివరించినట్టు తెలిపారు. అంతేకాదు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో బీజేపీనే హైకోర్టులో పిల్ వేసి.. రాజ్యాంగా న్ని కాపాడే ప్రయత్నం చేసిందని,.. దీంతో ఏపీలో బీజేపీకి మంచి బూమ్ వచ్చేసిందని చెప్పుకొచ్చారు కమలనాధులు.ఇంత బూమ్ వచ్చే సమయంలో మీరు కనుక జగన్కు అప్పాయింట్మెంట్ ఇస్తే.. ఏపీలో బీజేపీ గ్రాఫ్ పడిపోయి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాన్ని తృటిలో పోగొట్టుకుంటామని చెప్పుకొచ్చారట. సో.. అందుకే ఇవన్నీ లోతుగా ఆలోచించిన అమిత్ షా.. అత్యంత కీలక సమయంలో మరీ అత్యంత నిర్ణయంగా జగన్కు అప్పాయింట్ మెంట్ ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ బీజేపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారహో. ఇంతకన్నా జోక్ ఏదైనా ఉంటే చెప్పండి.. అందరం నవ్వేసుకుందాం